వంశీకి చెక్ పెట్టేందుకు ఏకమైన ప్రత్యర్థులు

Update: 2020-11-01 02:30 GMT
గన్నవరం పంచాయితీ తెగడం లేదు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి జైకొట్టిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని నియోజకవర్గ వైసీపీ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇటీవలే సీఎం జగన్ గన్నవరం పర్యటనలో వంశీ, వైసీపీ నియోజకవర్గ నేత యార్లగడ్డ వెంకటరావులను కలిసి పనిచేయాలని సూచించినా ఆధిపత్య పోరు మాత్రం ఆగడం లేదన్న చర్చ నియోజకవర్గంలో సాగుతోంది. రాజకీయం రగులుకుంటూనే ఉంది.

గన్నవరం నియోజకవర్గంలో తాజాగా ప్రత్యర్థులంతా ఏకమయ్యారు. ఇప్పటికే వంశీకి వ్యతిరేకంగా వైసీపీ పొలిటికల్‌ సలహా కమిటీ సభ్యుడు దుట్టా రామచంద్రరావు మాజీ ఎమ్మెల్యే బాలవర్దనరావు, యార్లగడ్డ వెంకటరావు ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. తాజాగా ఈ ముగ్గురూ మరోసారి రహస్యంగా భేటీ కావడం సంచలనమైంది. దుట్టా నివాసంలో ఈ భేటి జరిగింది. గంటపాటు ముగ్గురు వంశీకి వ్యతిరేకంగా సమాలోచనలు జరిపారు. వైసీపీ కార్యకర్త ఇంట్లో వివాహానికి హాజరయ్య సందర్భంలో తామంతా కలిశామని చెబుతున్నా అసలు టార్గెట్ వంశీనే అని చర్చ జరుగుతోంది.

ఎమ్మెల్యే వంశీ టీడీపీ నుంచి వైసీపీకి జైకొట్టి ఇప్పుడు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వంలో అన్నీ తానై నిర్వహిస్తున్నారు. వైసీపీ వారికి ప్రాధాన్యం ఇవ్వకుండా తనతోపాటు టీడీపీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తున్నారని వైసీపీని నమ్ముకొని ఉన్న క్షేత్రస్థాయి నేతలు రగిలిపోతున్నారట.. వైసీపీ నేతలు దుట్టా, బాలవర్ధనరావు, యార్లగడ్డలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు.

ఈ క్రమంలోనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ కోసం కష్టపడ్డ నేతలనే నిలపాలని.. వాళ్లనే గెలిపించుకుందామని ఈ ముగ్గురు నేతలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వంశీని రాబోయే స్థానిక ఎన్నికల నాటికి విజయవాడ పంపించాలని చూస్తున్నట్టు తెలిసింది.

వైసీపీ తరుఫున గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావును నిలపాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు తర్వాత జగన్ ముందు ఈ ప్రతిపాదన పెట్టాలని నిర్ణయించాట..

పార్టీ సీనియర్ నేత దుట్టా రాంచంద్రరావును ఎమ్మెల్సీగా పంపి.. యార్లగడ్డను వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జిగా చేయాలని పావులు కదుపుతున్నట్టు తెలిసింది. మరి ఇదంతా వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.
Tags:    

Similar News