వైసీపీ వర్సెస్ జనసేన : అనుకున్నంతా అయిందా...?

Update: 2022-10-15 14:42 GMT
విశాఖలో ఒకే రోజు రెండు పార్టీలు..రెండు కార్యక్రమాలు ఏమి జరుగుతుందో అని అంతా అనుకున్నారు. దానికి తగినట్లుగా బందోబస్తు పోలీసులు చేసుకున్నారు. విశాఖలో  ఉదయాన్నే వైసీపీ గర్జన మొదలై మధ్యాహ్నానికి పూర్తి అయిపోయింది. ఇక పవన్ టూర్ సాయంత్రం విశాఖలో ఉంది. పవన్ ఎపుడు విశాఖ వచ్చినా నేరుగా తన బసకు చేరుకుంటారు. కానీ ఈసారి గర్జనకు పోటీగా జనసేన నాయకులు ర్యాలీ తీయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. దాంతో గర్జనకు పోటా పోటీగా జనసేన రెడీ అవుతోందన్న విషయం అర్ధమైంది.

మరి ఈ టైంలో పోలీసులు గట్టి బందోబస్తు చేయాలి కదా. కానీ  చేయలేదు అన్న దానికి నిదర్శనమే విశాఖ ఎయిర్ పోర్టులో మంత్రుల కార్ల మీద జనసేన కార్యకర్తల దాడి అని అంటున్నారు. నిజానికి విశాఖ ఎయిర్ పోర్టులో జనసైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గర్జన కార్యక్రమం ముగించుకుని మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆ టైం కి పవన్ ఇంకా రాలేదు. జనసైనికులు వైసీపీ మంత్రుల కార్లు చూసి ఆ వైపుగా కొందరు వచ్చి దాడికి పాల్పడ్డారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ఒక వ్యక్తి అయితే ఏకంగా రోజా దగ్గరకే వచ్చి తన హెల్మెట్ ని ఆమె మీదకు విసిరేసే ప్రయత్నం చేశారు. నిజానికి పోలీసులు మంత్రులకు సెక్యూరిటీగా ఉంటారు. కానీ ఇక్కడ పోలీసుల సెక్యూరిటీ కూడా సరిపోలేదు అంటే అది పరిమితంగా చేశారా లేక జనసైనికులు ఆ స్థాయిలో విశాఖ  విమానాశ్రయంలో ఉంటారని ఊహించలేదా అన్న చర్చ వస్తోంది.

మరో వైపు దీని మీద జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ తమ పార్టీ వారు ఎవరూ వైసీపీ మంత్రుల మీద దాడి చేయలేదని ఖండించారు.వైసీపీ వారి డ్రామా ఆడుతున్నారని విమర్శించారు.  ఒక వేళ విమానాశ్రయంలో మంత్రుల మీద దాడి జరిగితే దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన అంటున్నారు. భద్రతాపరమైన వైఫల్యం కిందకే అది వస్తుంది కాబట్టి ప్రభుత్వమే ఈ విషయంలో తప్పు చేసినట్లు అన్నట్లుగా లాజిక్ పాయింట్ తీశారు.

నిజంగా కనుక ఆలోచిస్తే జనసేన నేత పవన్ కళ్యాణ్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఎపుడూ ఏపీలో రాజకీయ వేడి అగ్గి రాజేస్తూ  ఉంటుంది. అలాంటిది ఇద్దరూ ఒకే చోట కనిపిస్తే అది కచ్చితంగా ఇబ్బంది అవుతుందని పోలీసులు ఎందుకు ఆలోచించలేకపోయారు అన్నదే చర్చగా ఉంది. ఏది ఏమైనా విశాఖ ఎయిర్ పోర్టులో విద్వంశం జరిగింది నిజం. అక్కడ పూలకుండీలు సహా  చాలా ద్వంసం అయ్యాయి. కార్లమీద దాడి జరిగింది. అయితే దీనికి మొదటి కారణం పోలీసుల భద్రతా వైఫల్యమే అని అంటున్నారు.

పవన్ విశాఖ టూర్ విషయంలో ముందే చెప్పి భద్రత ఇవ్వాలని కోరినా మొక్కుబడిగా భద్రతా ఏర్పాట్లు ఎయిర్ పోర్టులో చేశారని నాదెండ్ల అంటున్నారు. ఆ విధంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చేసిన పొరపాట్ల వల్ల కూడా మంత్రుల మీద దాడి జరిగింది అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖలో ఒకే రోజు రెండు రాజకీయ కార్యక్రమాలు అంటే ఏదో జరుగుతుంది అనుకున్న వారికి ఇపుడు అలాగే జరిగింది. అది కూడా విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం అంటే ఇది సెంటిమెంట్ గా మారుతుండా   అన్నది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News