ఆ మాటతో ప్రియదర్శన్ బుక్కయిపోయాడు

Update: 2017-04-09 11:22 GMT
జాతీయ అవార్డులపై ఈ ఏడాది రగడ పెద్ద స్థాయిలోనే జరుగుతోంది. తనకు సన్నిహితులైన అక్షయ్ కుమార్.. మోహన్ లాల్ లకు అవార్డులు కట్టబెట్టడం ద్వారా ప్రియదర్శన్ పక్షపాతం చాటుకున్నాడని చాలామంది బాలీవుడ్ జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. స్వయంగా సౌత్ ఇండియన్ డైరెక్టర్ మురుగదాస్ సైతం అవార్డుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రియదర్శన్ పై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరింది.

ఈ నేపథ్యంలో ప్రియదర్శన్ మీడియా వాళ్లతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రమేష్ సిప్పీ జ్యూరీకి నేతృత్వం వహించినపుడు అమితాబ్ బచ్చన్ కు.. ప్రకాశ్ ఝా జ్యూరీ హెడ్ గా ఉన్నపుడు అజయ్ దేవగన్ కు అవార్డులు వచ్చాయని.. అప్పుడెవరూ ప్రశ్నించలేదని.. కానీ ఇప్పుడు తన మీద మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారని అన్నాడు. ఈ మాట అనడం ద్వారా తాను కూడా వాళ్ల బాటలోనే తన మిత్రులకు అవార్డులు ఇచ్చుకున్నానని ప్రియదర్శన్ సమర్థించుకున్నట్లే అయింది.

‘దంగల్’లో గొప్పగా నటించిన అమీర్ ను అవార్డుకు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రియదర్శన్ ను అడిగితే.. అమీర్ ఇంతకుముందు 2007లో జాతీయ అవార్డుకు ఎంపికైనపుడు వచ్చి అవార్డు తీసుకోలేదని.. అవార్డుల పట్ల గౌరవం లేనపుడు ఎందుకు అతణ్ని ఎంపిక చేయాలంటూ ప్రియదర్శన్ ప్రశ్నించడం కూడా విమర్శల పాలవుతోంది. నిజానికి అక్షయ్ కుమార్.. మోహన్ లాల్ అవార్డులు అందుకోగల సమర్థులే. అందుకే అర్హులే. కాకపోతే ప్రియదర్శన్ జ్యూరీ హెడ్ గా ఉండగా వాళ్లు అవార్డులకు ఎంపికవడం.. పైగా పోటీలో వారి కంటే బెటర్ పెర్ఫామెన్స్ ఇచ్చిన నటులుండటంతో వివాదం చెలరేగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News