'అఖండ' షూటింగ్ పూర్తి.. బాలయ్య బరిలో దిగేది ఎప్పుడో మరి..!

Update: 2021-08-12 05:29 GMT

నటసింహ నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న హ్యాట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ''అఖండ''. ఇటీవలే తమిళనాడులో ఈ చిత్రానికి సంబంధించిన ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న స్టంట్ శివ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

''అఖండ యూనిట్ మొత్తం ఒక ఫ్యామిలీగా వర్క్ చేసి షూటింగ్ పూర్తి చేశాం.. ఇంటర్వెల్ - ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్‌ తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్‌ లను 80 రోజులకు పైగా చిత్రీకరించాము'' అని స్టంట్ శివ తెలిపారు. తమిళనాడులోని ఒక ఆలయంలో క్లైమాక్స్ ఫైట్ ను షూట్ చేశారు. ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలవనుందని తెలుస్తోంది.

''అఖండ'' షూటింగ్ మొత్తం పూర్తవడంతో ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలు పెట్టనున్నారు. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే బాలయ్య చిత్రాన్ని ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారనేది ఆసక్తికరంగా మారింది. దసరా బరిలో 'ఆర్ ఆర్ ఆర్' వంటి భారీ పాన్ ఇండియా సినిమా వస్తుంది కాబట్టి.. ఆ సీజన్ లో బాలయ్య సినిమా వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి.

ఇప్పటికే సంక్రాంతి స్లాట్ నాలుగు పెద్ద సినిమాలతో బ్లాక్ అయింది. 'సర్కారు వారి పాట' 'PSPKRana' 'రాధే శ్యామ్' 'ఎఫ్ 3' చిత్రాలు పండక్కి రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణ చిత్రాన్ని వీటికి పోటీగా దింపకపోవచ్చు. దీంతో ఇప్పుడు ''అఖండ'' చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

క్రిస్మస్ బరిలో ఇప్పటికే 'పుష్ప 1' చిత్రాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. 'ఏజెంట్' సినిమా డిసెంబర్ 24 ను బ్లాక్ చేసుకుంది. మరి బాలయ్య 'అఖండ' చిత్రాన్ని ఏ డేట్ కి తీసుకొస్తారో చూడాలి. కాగా, 'సింహా' 'లెజెండ్' చిత్రాలు బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ - బోయపాటి కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యాక్షనిస్ట్ మరియు అఘోరా వంటి రెండు పాత్రల్లో నటసింహం సందడి చేయనున్నారు. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీకాంత్ - జగపతిబాబు - పూర్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్.ఎస్. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌ పై మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అఖండ' ప్రచార చిత్రాలు - రెండు టీజర్‌ లకు మంచి ఆదరణ లభించింది. మరి సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News