మహేషా.. బన్నీనా.. కొనసాగుతున్న సస్పెన్స్

Update: 2017-12-31 11:33 GMT
‘2.0’ రిలీజ్ డేట్ విషయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు. తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్ 14న ఈ చిత్రం రిలీజవుతుందని ప్రకటించాడు. దీంతో తాము ఫిక్స్ చేసుకున్న ఏప్రిల్ 27వ తేదీని హైజాక్ చేసేస్తున్నారంటూ ‘2.0’ నిర్మాతలపై ఆగ్రహంగా ఉన్న ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ చిత్ర బృందాలకు టెన్షన్ తీరిపోయింది. రజినీ భయం గురించి మరిచిపోయి.. వీళ్లు ఒక అండర్ స్టాండింగ్ కు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఒకరితో ఒకరు పోటీగా ఏప్రిల్ 27వ తేదీన రిలీజ్ డేట్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ పోటీ మంచిది కాదన్న ఉద్దేశంతో రెండు చిత్రాల నిర్మాతల మధ్య చర్చలు నడిచాయి. కానీ ఔట్ కమ్ ఏంటన్నది తెలియలేదు.

ఈ లోపే ‘2.0’ గొడవ మొదలైంది. ఇప్పుడది తీరిపోయింది కాబట్టి వీళ్లు ఒక క్లారిటీకి రావాల్సిన సమయం ఆసన్నమైంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బన్నీ సినిమానే వెనక్కి వెళ్తుందట. ఈ చిత్ర షూటింగ్ కొంచెం లేటవుతుండటంతో మే రెండో వారానికి వాయిదా వేద్దామన్న ఆలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆ విషయంపై ఓ స్పష్టత వచ్చేస్తే ‘భరత్ అను నేను’ ఏప్రిల్ 27నే వస్తుందన్న విషయాన్ని మరోసారి ధ్రువీకరిస్తారు. ఐతే ‘2.0’ ఏప్రిల్ 14కు పక్కానా అనే విషయంలో ఇంకా కొంచెం సందేహాలున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడి ఉండటంతో మళ్లీ డేట్ మారినా మారొచ్చేమో అన్న ఆందోళనా లేకపోలేదు. మరి 2018 ఏప్రిల్ సినిమాల విషయంలో పూర్తి స్పష్టత ఎప్పుడొస్తుందో చూడాలి.
Tags:    

Similar News