బన్నీ అక్కడ స్కోర్ చేసేశాడు..

Update: 2020-01-07 07:18 GMT
అల్లు అర్జున్ ఏదైనా స్టేజ్ ఎక్కాలంటే ఒక రేంజిలో ప్రిపేరై వస్తాడు. తన సినిమాకు సంబంధించి టీం మొత్తాన్ని అక్కడ కవర్ చేస్తాడు. అలాగే ప్రతి వేడుకలోనూ ఏదో ఒక ఎజెండా పెట్టుకుని తన సినిమాతో సంబంధం లేని టాపిక్‌ రైజ్ చేసి మాట్లాడతాడు. జనాలకు బలంగా ఏదైనా విషయం చెప్పాలని చూస్తాడు. అలాగే ఇండస్ట్రీ బాగు గురించి కూడా మాట్లాడతాడు. తన కొత్త చిత్రం ‘అల వైకుంఠపురములో’ మ్యూజికల్ కన్సర్ట్ సందర్భంగా కూడా బన్నీ.. ఈ బాక్సులన్నిటికీ టిక్ కొట్టేలా మాట్లాడటం విశేషం. తన టీంను ఓ రేంజిలో పొగిడిన బన్నీ.. అభిమానుల్ని కూడా ఆకాశానికెత్తేశాడు. ఎప్పుడూ లేని విధంగా తన తండ్రి అల్లు అరవింద్ గురించి కూడా ఈ వేడుకలో చాలా ఎమోషనల్‌ గా మాట్లాడాడు బన్నీ. ఇవన్నీ పక్కన పెడితే.. సంక్రాంతికి తన చిత్రంతో పాటు రాబోయే మిగతా సినిమాల గురించి కూడా బన్నీ ప్రస్తావించడం విశేషం.

తనకు చిరంజీవి అంటే ఎంతిష్టమో చెప్పిన బన్నీ.. ఆయన తర్వాత తనకు రజనీకాంత్ అంటే అంతిష్టమని.. ఆయన తనకు ఇన్‌ స్పిరేషన్ అని.. సంక్రాంతికి ఆయన నటించిన ‘దర్బార్’ సినిమా కూడా రాబోతోందని.. దాని దర్శకుడు మురుగదాస్ కూడా తన ఫేవరెట్ అని.. కాబట్టి ఆ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నానని అన్నాడు బన్నీ. అలాగే మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సైతం బాగా ఆడాలని కోరుకుంటున్నానని చెప్పిన బన్నీ.. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా విషెస్ చెప్పాడు. కళ్యాణ్ రామ్ సినిమా పేరు గుర్తుకు రాక వేరే వాళ్లను అడిగి మరీ తెలుసుకుని ‘ఎంతమంచి వాడవురా’ బాగా ఆడాలని.. సంక్రాంతికి అన్ని సినిమాలూ విజయవంతం కావాలని అభిలషించాడు బన్నీ. ఐతే ముందు రోజు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ మాత్రం ఈ పని చేయలేకపోయాడు. తన సినిమా గురించే మాట్లడాడు. సంక్రాంతికి వచ్చే ఇతర సినిమాలకు కూడా అతను విషెస్ చెప్పి ఉంటే బాగుండేది. ఈ విషయంలో బన్నీ స్కోర్ చేసేశాడు.


Tags:    

Similar News