మన్మధుడితో రంగమ్మత్త 'జబర్దస్త్‌'?

Update: 2019-07-24 14:00 GMT
బుల్లి తెరపై ఒక వైపు యాంకర్‌ గా రాణిస్తూనే మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూనే ఫుల్‌ లెంగ్త్‌ పాత్రను.. హీరోయిన్‌ పాత్రలను కూడా అనసూయ పోషిస్తూ వస్తోంది. తాజాగా ఈమె లీడ్‌ రోల్‌ లో నటించిన 'కథనం' చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రాజేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌ మరియు అవసరాలలు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రెడీ అయిన 'కథనం' చిత్రం విడుదల తేదీ విషయంలో చర్చలు జరుగుతున్నాయి.

సినిమా ఎంత బాగా తీసినా కూడా సరైన డేట్‌ లో విడుదల చేయలేకపోతే ఆ సినిమా కలెక్షన్స్‌ ను వసూళ్లు చేయలేదు. అందుకే సినిమా విడుదల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే కథనం చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా సినిమా విడుదల తేదీ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఆగస్టు 9వ తేదీన లేదంటే కాస్త అటు ఇటుగానే ఈ చిత్రంను విడుదల చేయడం వల్ల వారంలో ఎక్కువ సెలవులు వస్తే కలెక్షన్స్‌ బాగుంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఆగస్టు 9వ తారీకున మన్మధుడు 2 చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం విడుదల ఉన్న నేపథ్యంలో ఇతర చిన్న చిత్రాలు వేరే డేట్‌ కు షిప్ట్‌ అవుతున్నాయి. కాని కథనం చిత్రంను మాత్రం మన్మధుడు 2 కు పోటీగా అన్నట్లుగా అదే రోజు లేదంటే ఒకటి రెండు రోజులు అటు ఇటుగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సినిమాకు మంచి టాక్‌ వస్తే ఖచ్చితంగా మన్మధుడు 2  చిత్రంకు పోటీగా నిలిచే అవకాశం ఉంటుందని.. అదే నెగటివ్‌ టాక్‌ వస్తే ఎప్పుడు వచ్చినా అదే ఫలితం అనే అభిప్రాయంలో కథనం మేకర్స్‌ ఉన్నారు. విడుదల విషయంలో యూనిట్‌ సభ్యుల తుది నిర్ణయం ఒకటి రెండు రోజుల్లో వెళ్లడయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News