నయనతార నుంచి మరో హారర్ థ్రిల్లర్!

Update: 2021-11-19 04:07 GMT
తమిళనాట నాయిక ప్రధానమైన కథలను సిద్ధం చేసుకునే దర్శక నిర్మాతలు ముందుగా పరిశీలించే పేరు నయనతార. అసలు అక్కడ ఆ తరహా కథలను రాసేవారు నయనతారను ఊహించుకోకుండా ఉండలేరు. ఎందుకంటే అంతగా ఆమె ఆ తరహా సినిమాలలో తన విశ్వరూపం చూపించింది .. ప్రేక్షకులకు ఆ తరహా పాత్రలతో అంతగా కనెక్ట్ అయింది. ఆమె చేసిన ఈ తరహా సినిమాలకు తమిళంలోనే కాదు తెలుగులోను కాసుల వర్షం కురుస్తూ ఉంటుంది. అలా ఆమె చేసిన హారర్ థ్రిల్లర్ సినిమాల్లో 'మాయా' ఒకటి.

అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2015లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో .. పరిమితమైన పాత్రలతో చేసిన సినిమా ఇది. కథ అంతా కూడా 'మాయావనం' అనే ఒక అడవితో ముడిపడి ఉంటుంది. ఇది దెయ్యం కథే అయినప్పటికీ, ప్రేతాత్మ మాటిమాటికి వచ్చి భయపెట్టడం ఉండదు. అందుకు సంబంధించిన ప్రభావం మాత్రం సినిమా అంతటా ఉంటుంది. 'మాయా నీ బిడ్డ నా దగ్గర లేదు' అనే డైలాగ్ ప్రేతాత్మతో ముడిపడి ఉంటుంది. ఫొటోగ్రఫీ .. రీ రికార్డింగ్ .. ఎడిటింగ్ ఈ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టేశాయి. క్లైమాక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
Read more!

అలా ఆ సినిమాను అంత పెద్ద హిట్ చేసిన అశ్విన్ శరవణన్ .. నయనతారతో మరో హారర్ థ్రిల్లర్ సినిమాను ప్లాన్ చేశాడు.

ఈ సినిమాకి 'కనెక్ట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. నిన్న నయనతార పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. ఆరేళ్ల తరువాత నయనతారతో మళ్లీ కలిసి పనిచేస్తుండటం పట్ల అశ్విన్ శరవణ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఆమెకి శుభాకాంక్షలు తెలియజేశాడు. గోడపై 'శిలువ' గుర్తును గీస్తూ నయనతార ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. పోస్టర్ ను డిజైన్ చేసిన తీరు ఆసక్తిని రేపుతోంది.

రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహర్తిస్తున్నాడు. పృథ్వీ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. కీలకమైన పాత్రల కోసం అనుపమ్ ఖేర్ ను .. సత్యరాజ్ లను ఇంతవరకూ ఎంపిక చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'మాయా' సినిమా తెలుగులో 'మయూరి'గా ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఇక్కడ కూడా భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే ఎవరూ కూడా మిస్ కారు. మరి 'కనెక్ట్' ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News

eac