పూరీ విషయంలో కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారా..?

Update: 2022-10-28 09:46 GMT
'లైగర్' సెటిల్మెంట్ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. నష్టపరిహారం చెల్లించే విషయంలో ఫైనాన్షియర్లు, బయ్యర్లతో దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ కు తలెత్తిన గొడవ.. పోలీస్ స్టేషన్ వరకూ చేరింది. తన ఫ్యామిలీకి ప్రాణహాని ఉందంటూ పూరీ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా పూరీ విషయంలో కోర్టుకు వెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైగర్' సినిమా కారణంగా అందరూ తీవ్రంగా నష్టపోయారు. అయితే పూరీ కొంత మేర నష్టపరిహారం చెల్లిస్తానని హామీ ఇచ్చి.. రోజులు గడుస్తున్నా మాట నిలబెట్టుకోకపోవడంతో బయ్యర్లు ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పూరీ మాట్లాడిన ఓ ఆడియో లీకై వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా పాపం వాళ్ళు కూడా నష్టపోయారు కదా అని ఇవ్వాలని అనుకున్నానని.. తనను బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ఇస్తానన్న డబ్బు కూడా ఇవ్వబుద్ధి కాదని పూరీ పేర్కొన్నారు. ఎవరు ధర్నా చేస్తారో వారిని మినహాయించి మిగతా వాళ్లకు డబ్బులిస్తానని తెలిపారు.

ఈ క్రమంలో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను మరియు ఫైనాన్షియర్ శోభన్ బాబుల వల్ల తనకూ తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పూరీ జగన్నాథ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంలో ఇప్పుడు ఫైనాన్షియర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ దర్శకుడిపై గుర్రుగా ఉన్నారట. సినిమా వ్యాపారం అనేది చాలా గుట్టుగా సాగే వ్యవహారమైతే.. ఇలా బజారుకు ఎక్కిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.

'లైగర్' సినిమా వల్ల భారీగా నష్టపోయామని.. కొంత మేర నష్టపరిహారం ఇస్తానని హామీ ఇచ్చిన పూరి.. ఆ తర్వాత ఫోన్ ఎత్తకుండా మొహం చాటేశారని బయ్యర్లు అంటున్నారు. ఫోన్లు ఆన్సర్ చేయడం మానేసినప్పుడు.. అసలు ఎలా బ్లాక్ మెయిల్ చేయగలమని ప్రశ్నిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి, తిరిగి చెల్లిస్తానన్న డబ్బులు ఎగ్గొట్టే ప్లాన్ చేస్తున్నారని ఓ వర్గం ఆరోపిస్తోంది.

నిజానికి 'లైగర్' సినిమాని చాలా వరకు నాన్ రికవరబుల్ అడ్వాన్స్ కింద అమ్మారు. కాబట్టి నష్టం వస్తే తిరిగి చెల్లించాలనే షరతు ఏమీ ఉండదు. కాకపోతే బయ్యర్లు భారీగా నష్టపోవడంతో.. పూరీ జగన్నాథ్ నైతిక బాధ్యతతో కొంత భాగాన్ని తిరిగి ఇవ్వడానికి అంగీకరించాడు.

ఈ మేరకు బయ్యర్లతో మాట్లాడి ఒక నెల టైం తీసుకున్నట్లు పూరీ స్వయంగా వెల్లడించారు. అయితే ఈ సెటిల్మెంట్ వ్యవహారం వివాదంగా మారింది. పూరీ కేసు పెట్టిన నేపథ్యంలో.. నష్టపరిహారం చెల్లిస్తానని దర్శక నిర్మాత హామీ ఇచ్చిన మెసేజులు - వాయిస్ మెసేజ్ లతో కొందరు బయ్యర్లు సివిల్ కోర్టుకు వెళ్లాలని చూస్తున్నట్లు టాక్స్ నడుస్తున్నాయి.

మరోవైపు పూరి జగన్నాథ్ తీరుపై ఫైనాన్షియర్ల సంఘం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు వినికిడి. ఇకపై పూరీ సినిమాలకు ఫైనాన్స్ చేయకూడదని టాలీవుడ్ ఫైనాన్షియర్లు అంతర్గత నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరి సినిమాల విషయంలో కఠిన నిర్ణయం తీసుకోడానికి రెడీ అయ్యారని అంటున్నారు.

ఏదేమైనా 'లైగర్' సినిమాకు సంబంధించి సెటిల్ మెంట్ వివాదం బాగా ముదురుతున్నట్లే కనిపిస్తోంది. మరి పూరీ జగన్నాథ్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫైనాన్షియర్స్ కలిసి దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News