థమన్ బాటలో లిరిసిస్ట్ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు..!

Update: 2022-07-13 09:30 GMT
సినీ ఇండస్ట్రీలో తెర వెనుక కష్టపడే వారికి ఒకప్పుడు పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించే నటీనటులతో సమానంగా టెక్నిషియన్స్ కు కూడా గుర్తింపు లభిస్తోంది. సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత వారు కూడా తమవంతుగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా గడుపుతున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్.. తన సినిమాలను సామాజిక మాద్యమాలలో ప్రమోట్ చేస్తుంటారనే సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెద్ద హీరోల చిత్రాలకు థమన్ ఓ రేంజ్ లో హైప్ తీసుకొస్తారు. ఇప్పుడు సంగీత దర్శకుడి బాటలో లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి కూడా నడుస్తున్నాడు.

థమన్ ప్రస్తుతం మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సినిమాలలో NBK107 కూడా ఉంది. నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని పాటలకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందిస్తున్నారు.

దర్శక హీరోల గత చిత్రాలు 'క్రాక్' 'అఖండ' చిత్రాలకు వర్క్ చేసిన థమన్ - రామజోగయ్య శాస్త్రి.. ఈసారి అంతకుమించిన అవుట్ పుట్ ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. తాజాగా రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ వేదికగా అప్డేట్ ఇచ్చారు. బాలయ్య సినిమా కోసం పాట రాస్తున్నట్లు తెలిపారు.

గీత రచయిత ట్వీట్ చేస్తూ.. 'ట్రాయ్ మిచిగాన్.. జై బాలయ్య' అని పేర్కొన్నారు. లిరిక్స్ రాయడంలో మునిగిపోయిన ఓ ఫోటోని కూడా షేర్ చేశారు. మిచిగాన్ లోని ట్రాయ్ నగరంలో రామజోగయ్య శాస్త్రి పాట రాస్తున్నట్లు అర్థం అవుతోంది.

ఈ చిత్రానికి ''జై బాలయ్య'' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న నేపథ్యంలో శాస్త్రి అదే హ్యాష్ ట్యాగ్ ని పెట్టడం గమనార్హం. ఏదేమైనా ఈ సినిమా గురించి థమన్ అగ్రిసివ్ గా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు లిరిసిస్ట్ కూడా తోడయ్యారని చెప్పాలి.

#NBK107చిత్రంలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ చేస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా.. రామ్-లక్ష్మణ్ ద్వయం ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News