టాలీవుడ్ లో విషాదం.. ఏషియన్ నారాయణ దాస్ కన్నుమూత..!

Update: 2022-04-19 05:29 GMT
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు నారాయణ దాస్ కె నారంగ్ (78) కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతతో బాధ పడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేశారు. చికిత్స పొందుతూ పరిస్థితి మంగళవారం విషమించడంతో తుదిశ్వాస విడిచారు.

నారాయణ దాస్ నారంగ్ పార్దీవ దేహాన్ని మరో గంటలో ఆస్పత్రి నుంచి వారి స్వగృహానికి తరలించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వారి ఇంటికి వచ్చి నివాళులు అర్పించనున్నారు.

ఏషియన్ ఫిలిమ్స్ మరియు ఏషియన్ సినిమాస్ గ్రూప్ అధినేతగా నారాయణ్ దాస్ నారంగ్ గత కొన్నేళ్ళుగా సినిమాల డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో తనదైన ముద్ర వేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ స్థాపించి సినిమా నిర్మాణంలోకి కూడా దిగారు. తొలి ప్రయత్నంగా 'లవ్ స్టోరీ' సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

ప్రస్తుతం అక్కినేని నాగార్జునతో 'ది ఘోస్ట్' సినిమాను నిర్మిస్తున్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. అలానే శివ కార్తికేయన్‌ తో ఒక చిత్రం.. సుధీర్‌ బాబుతో ఓ ప్రాజెక్టు లైన్ లో ఉన్నాయి. సందీప్‌ కిషన్‌ తో 'మైఖేల్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు.

ఫైనాన్షియర్ గా డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబిటర్ గా ప్రొడ్యూసర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించారు నారాయణ దాస్ నారంగ్. ఆయన మరణవార్త తెలియడంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
Tags:    

Similar News