ప్ర‌భాస్ తో టీసిరీస్ నాలుగో సినిమాకి బిగ్ ప్లాన్

Update: 2022-10-03 04:35 GMT
భార‌త‌దేశ‌పు మోస్ట్ అవైటెడ్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. ప్ర‌భాస్ అభిమానులు స‌హా ప్రేక్ష‌కుల నుంచి ఈ చిత్రం మెప్పు పొందుతోంది. ఈ సినిమాని ఎప్పుడు వీక్షించాలా అన్న ఆత్రం అంద‌రిలో పెంచ‌డంలో టీజ‌ర్ స‌ఫ‌ల‌మైంది. ప్రభాస్- కృతి సనన్- సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను ఉత్తరప్రదేశ్ - అయోధ్యలో అధికారికంగా ఆవిష్కరించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో మెరుపులు ఉరుములతో కూడిన విజువ‌ల్ ఫీస్ట్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. రాఘ‌వ (ప్రభాస్) తన బాణాన్ని ఆకాశం వైపు గురిపెట్టి  లార్డ్ రామ్ పాత్రను పెద్ద‌తెర‌పై ఘ‌నంగా ఆవిష్క‌రిస్తున్నాన‌ని ప్రామిస్ చేసాడు. మరోవైపు లంకేష్ (విల‌న్) పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.

ఆదిపురుష్ అనేది హిందూ ఇతిహాసం రామాయణం నుంచి స్ఫూర్తి పొంది రూపొందిస్తున్న సినిమా. ఈ చిత్రానికి తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ మూవీ థీమ్ అని ఓంరౌత్ ఇంత‌కుముందు వెల్ల‌డించారు.

ఈ చిత్రాన్ని టి-సిరీస్ అధినేత‌ భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్- ఓం రౌత్ - ప్రసాద్ సుతార్ స‌హా రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్ సంయుక్తంగా నిర్మించారు. ఆదిపురుష్ టీజర్ లాంచ్ లో ప్రభాస్ తో క‌లిసి ప‌ని చేయ‌డం గురించి ప్ర‌ముఖ నిర్మాత,.. టీసిరీస్ అధినేత‌ భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఆదిపురుష్ త‌ర్వాత సౌత్ సూపర్ స్టార్ ప్ర‌భాస్ తో తన నాల్గవ చిత్రాన్ని ధృవీకరించారు. "ప్రభాస్ - నేను చాలా సినిమాలు చేస్తున్నాం. ఆదిపురుష్‌ మాకు మూడవ చిత్రం. మేము ఇప్ప‌టికే నాల్గవ చిత్రాన్ని కూడా లాక్ చేసాం" అని తెలిపారు. వీరిద్దరూ గతంలో సాహో - రాధే శ్యామ్ చిత్రాలకు క‌లిసి ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే. ఆదిపురుష్ మూడ‌వ సినిమా. త‌దుప‌రి మ‌రో చిత్రాన్ని టీసిరీస్ అధినేత అధికారికంగా ప్ర‌క‌టించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది.

ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లోనే టీసిరీస్ అధినేత‌ భూషణ్ తన దివంగత తండ్రి గుల్షన్ కుమార్ ను గుర్తు చేసుకుంటూ-"నా తండ్రి గుల్షన్ కుమార్ ఎప్పుడూ అంకితభావంతో ఉండే వ్యక్తి. అతని కల ఈ రోజు ఇక్కడ నెరవేరుతోంది. ఈ రోజు మా నాన్న చాలా సంతోషంగా ఉంటారు. సినిమాలో అద్భుతంగా నటించినందుకు ప్రభాస్ కి.. కృతికి ధన్యవాదాలు. ద‌ర్శ‌కుడి ప‌నిత‌నానికి మా కృత‌జ్ఞ‌త‌లు" అని అన్నారు.

ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామ మందిరంలో శ్రీ‌రాముని ఆశీర్వాదం తీసుకున్న అనంత‌రం ఆదిపురుష్ టీమ్ ప్ర‌చారాన్ని ఘ‌నంగా ప్రారంభించింది.  ప్రభాస్- కృతి- సైఫ్ లతో పాటు ఓం రౌత్ కూడా శ్రీ‌రాముని ధీవెన‌లు అందుకున్నారు. సన్నీ సింగ్ ఈ చిత్రంలో లక్ష్మణ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 12 జనవరి 2023న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News