మ‌ళ్లీ రోడ్డెక్కిన చ‌క్రి కుటుంబం

Update: 2016-03-01 07:58 GMT
చక్రి... స్వ‌శ‌క్తితో ఎదిగి టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ . ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో చ‌క్రి చనిపోయి దాదాపు ఏడాది గడిచిపోయింది. ఆయ‌న మ‌ర‌ణం స‌మ‌యంలోనే చ‌క్రి స‌తీమ‌ణికి, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు మ‌ధ్య నెల‌కొన్న వివాదాలు తెర‌మీద‌కు వ‌చ్చాయి. ఈ ప‌రిణామాల‌పై చ‌క్రి అభిమానులే కాకుండా సినీ ఇండ‌స్ర్టీ వ‌ర్గాలు కూడా ఒకింత క‌ల‌త చెందాయి. అప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగిన‌ట్లే క‌నిపించిన‌ప్ప‌టికీ... మ‌ళ్లీ చ‌క్రి కుటుంబం రోడ్డెక్కింది.

తాజాగా కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా కాకుండా ఆర్థిక ప‌ర‌మైన విష‌యాల్లో చ‌క్రి తల్లి విద్యావతి - ఆయన సోదరుడు మ‌హిత్ నారాయ‌ణ రోడ్డెక్కారు. కిరాయిదారు త‌మ‌కు అద్దె చెల్లించ‌డంలేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సోమాజిగూడలోని వరుణ్ సర్గం విల్లా ఫ్లాట్ లో రెంట్ కు ఉంటున్నమాధవి అనే మహిళ ఫ్లాట్ ఖాళీ చేయడం లేద‌ని పైగా అద్దె కూడా ఇవ్వ‌కుండా ఇబ్బందులకు గురి చేస్తుందంటూ వారు ఆరోపించారు. మాధవి ఎనిమిది నెలలుగా అద్దె ఇవ్వటం లేదని, ప్రస్తుతం ఆ ఫ్లాట్ పై ఉన్న లోన్ డబ్బులు కూడా తామే కడుతున్నామ‌ని పేర్కొంటూ చక్రి సోదరుడు, ఆయ‌న త‌ల్లి దీక్షకు దిగారు. త‌మ ఫ్లాట్ అప్ప‌గించే వ‌ర‌కు దీక్ష విర‌మించేది లేద‌న్నారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి చ‌క్రి సోద‌రుడితో మాట్లాడారు. త‌న‌కు చ‌క్రి స‌న్నిహితుడ‌ని పేర్కొంటూ స‌మ‌స్య‌ను తాను ప‌రిష్క‌రిస్తాన‌ని చెప్పారు.
Tags:    

Similar News