చిరంజీవి Vs బాలయ్య.. ఎవరు ముందు? ఎవరు వెనుక?

Update: 2022-10-31 12:30 GMT
2023 సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ వార్ చూడబోతున్నాం. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పండక్కి పెద్దగా భారీ చిత్రాల సందడి కనిపించలేదు కానీ.. ఈసారి మాత్రం స్టార్ హీరోలు బిగ్ ఫైట్ కు రెడీ అవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'వాల్తేరు వీరయ్య' మరియు నటసింహం నందమూరి బాలకృష్ణ 'వీర సింహా రెడ్డి' చిత్రాలను సంక్రాంతి బరిలో దింపుతున్నట్లు అధికారికంగా ప్రకటించబడింది. అయితే ఈ రెండు సినిమాలూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందినవే కావడం గమనార్హం.

సాధారణంగా ఒకే సంస్థ నిర్మించిన రెండు పెద్ద సినిమాలు ఒకే సీజన్ లో రిలీజ్ అవ్వడం అనేది జరగదు. కానీ ఇప్పుడు మైత్రీ వారు ఈ పొంగల్ కు.. తమ సినిమాతో తమ సినిమానే పోటీకి సిద్ధం చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి అనుకుంటా.

ఈ విషయం మీద చిరు - బాలయ్య లతో మాట్లాడి పోటీని నివారించేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేసినా కుదరకపోవడంతో.. రెండు చిత్రాలను ఒకేసారి రిలీజ్ చేయక తప్పలేదు. కాకపోతే క్లాష్ అవకుండా విడుదలకు ఒక వారం గ్యాప్ ఉండేలా చూసుకుంటారని అందరూ భావించారు.

కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. 'వాల్తేరు వీరయ్య' మరియు 'వీరసింహారెడ్డి' సినిమాలు రెండూ సంక్రాంతి సందర్భంగా మాత్రమే విడుదల కానున్నాయి. అయితే ఇక్కడ బాలకృష్ణ - చిరంజీవి సినిమాలలో ఏది ముందు? ఏది వెనుక? అనేది నిర్మాతలకు మరో సమస్యగా మారింది.

రవీంద్ర కొల్లి (బాబీ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి 154వ చిత్రాన్ని జనవరి 11న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరోవైపు గోపీచంద్ మలినేని రూపొందించిన బాలయ్య 107వ సినిమాని జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టు కున్నారట.

ఈ మేరకు ఇప్పటికే థియేటర్లను లాక్ చేయమని.. విడుదల తేదీలలో ఎటువంటి మార్పు ఉండదని మైత్రీ టీమ్ నుండి డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత చిరు - బాలయ్య పండుగ బరిలో దిగుతుండటం అందరినీ ఉత్సాహ పరుస్తోంది. కాకపోతే రెండూ ఒకే బ్యానర్ లో రూపొందుతున్న సినిమాలు కావడంతో ఎలా ప్లాన్ చేస్తారో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇకపోతే జనవరి 12వ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఆదిపురుష్' చిత్రం షెడ్యూల్ చేయబడింది. అయితే ఇప్పుడు ఈ పౌరాణిక చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ విషయం మీద టీ-సిరీస్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా దిల్ రాజు నిర్మిస్తున్న 'వారసుడు' సినిమా కూడా సంక్రాంతికే రాబోతోంది. జనవరి 11న లేదా 13న విడుదల చేయాలని చూస్తున్నారని టాక్. చిరంజీవి & బాలకృష్ణ సినిమాల రిలీజ్ ని బట్టి ఈ సినిమా కోసం తేదీన ఖరారు చేస్తారని అంటున్నారు.

పొంగల్ సీజన్ లో విడుదల చేస్తామని ప్రకటించిన అఖిల్ అక్కినేని మరియు సురేందర్ రెడ్డి కాంబోలో తెరకెక్కుతుంమ 'ఏజెంట్' సినిమా.. మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News