విక్రమ్ కు గోల్డెన్ వీసా.. పూర్ణకు లింకేంటి..?

Update: 2022-11-10 02:30 GMT
దుబాయ్ ప్రభుత్వం పలువురు భారతీయ నటీనటులకు గోల్డెన్ వీసాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ కు దుబాయ్ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని హీరోయిన్ పూర్ణ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తన భర్తతో కలిసి విక్రమ్ కు దుబాయ్ గోల్డెన్ వీసా అందిస్తున్న ఓ ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్ చేసింది.

అయితే పూర్ణ (షమ్యా ఖాసీమ్) మరియు ఆమె భర్త షానిద్ అనీఫ్ చేతుల మీదుగా విక్రమ్ కు ఈ గోల్డెన్ వీసా ఇవ్వడంపై నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పెళ్లి చేసుకుని దుబాయ్ కి వెళ్లిన నటి పూర్ణ కు ప్రభుత్వ వీసాలతో సంబంధం ఏంటి అని నెటిజన్లు ఆరాలు తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ భర్త చొరవతోనే చియాన్ కు గోల్డెన్ వీసా వచ్చినట్లు తెలుస్తోంది.

పూర్ణ భర్త షానిద్ అసీఫ్ అలీ యూఏఈలోని పెద్ద బిజినెస్ మ్యాన్ లలో ఒకరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అతను అక్కడ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అయితే షానీద్ కు చెందిన కంపెనీ ద్వారానే ఇప్పుడు విక్రమ్ కు గోల్డెన్ వీసా వచ్చిందని.. అందుకే వారి చేతుల మీదుగా అందించారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.  

కాగా, విద్య, సాహిత్యం, సినిమా, కల్చర్ వంటి వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఈ వీసా ఉన్నవారు అరబ్ దేశాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. అక్క‌డ ఉద్యోగాలు చేసుకోవ‌టానికి.. వ్యాపారాలు చేసుకోవ‌టానికి అనుమ‌తినిస్తుంది.

2019 నుంచి యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తుండగా.. ఇప్పటి వరకూ కమల్ హాసన్ - మోహన్ లాల్ - మమ్ముట్టి - షారుక్ ఖాన్ - త్రిష - కాజల్ అగర్వాల్ - ఉపాసన కొణిదెల - సుకుమార్ వంటి ప్రమఖులకు అందజేశారు. తాజాగా ఈ జాబితాలో హీరో విక్రమ్ కూడా చేరటం విశేషం.

ఇకపోతే వైవిధ్యమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు విక్రమ్. సినిమా కోసం ఏమైనా చేయటానికి రెడీగా ఉండే చియాన్ కు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించే తమిళ సినిమాలన్నీ తెలుగులోనూ రిలీజ్ అవుతుంటాయి. నిజానికి కెరీర్ ప్రారంభంలో విక్రమ్ అనేక తెలుగు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

ఈ ఏడాది ప్రారంభంలో "మహాన్" అనే సినిమాతో ఓటీటే ఆడియన్స్ ను పలకరించిన విక్రమ్.. "కోబ్రా" చిత్రంలో వివిధ గెటప్స్ తో ఆకట్టుకున్నారు. ఇటీవల "పొన్నియన్ సెల్వన్ 1" సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో "పీఎస్ 2" మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం పా. రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ "తంగలన్" అనే సినిమాలో నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News