'నేను రాసుకునే ప్రతి కథకీ ఆ కథే హీరో'

Update: 2021-08-26 09:30 GMT
'పలాస 1978' సినిమాతో విమర్శలు ప్రశంసలు అందుకున్న డైరెక్టర్ కరుణ కుమార్‌.. ఇప్పుడు ''శ్రీదేవి సోడా సెంటర్‌'' అనే వైవిధ్యమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుధీర్‌ బాబు - ఆనంది జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని 70ఎంఎం బ్యానర్ పై విజయ్‌ చిల్లా - శశిదేవి రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ఈ నెల 27న విడుదల అవుతున్న నేపథ్యంలో దర్శకుడు కరుణ కుమార్‌ మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

''పలాస తరహాలో కాకుండా కొంచెం భిన్నంగా గ్రామీణ నేపథ్యంలో సాగే చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ఇప్పటివరకు గోదావరి జిల్లాలంటే అరిటాకులు, అమ్మమ్మల ఆప్యాతలు, పొలంగట్లనే తెరపై చూశాం. అక్కడి సామాజిక, ఆర్థిక కోణాల్ని, ఆ నేపథ్యంలో భావోద్వేగాల్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఈ సినిమాతో చేశాం. ఈ కథలో ఓ ప్రేమకథ కూడా ఉంటుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందించాం. అమలాపురం చుట్టుపక్కల గ్రామాల బ్యాక్‌ డ్రాప్‌ లో సాగే లవ్‌ స్టోరీ. ఓ సోడా సెంటర్‌ యజమాని కూతుర్ని ఓ ఎలక్ట్రీషియన్‌ ప్రేమిస్తాడు. అక్కడి సాంఘిక, ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందుల వల్ల వీరి ప్రేమకథ ఏమైందనేదే ఈ సినిమా కంథాంశం'' అని కరుణ కుమార్‌ తెలిపారు.

''సుధీర్‌ బాబు కి రెండు కథలు చెబితే ‘శ్రీదేవి సోడా సెంటర్‌’ ను ఎంపిక చేసుకున్నారు. నిర్మాతలు మంచి ఫ్రీడమ్‌ ఇచ్చారు. ఈ సినిమాలో మణిశర్మగారి కొత్తరకం బాణీలు వింటారు'' అని దర్శకుడు అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. హీరోయిన్‌ పాత్ర కోసం కొంతమంది తెలుగు అమ్మాయిలకు ఫోన్‌ చేయగా, కొందరు సినిమాలో ‘హీరో ఎవరు?’ అని అడిగారు. మరికొందరు వాళ్ల మేనేజర్లకు స్టోరీ చెప్పమన్నారు. అంతేకానీ కథలు ఎవరూ వినలేదు అని కరుణ కుమార్‌ చెప్పారు.

''పది పద్నాలుగేళ్లుగా మనం కథలు చెప్పడం మర్చిపోయి.. ఒక మూస ధోరణిలో వెళ్తున్నాం. పరభాషా చిత్రాలు చూసి తెలుగులో అలాంటివి రావడం లేదని ఆ చిత్రాలను అభినందిస్తుంటాం. నిజానికి 'శంకరాభరణం' 'సిరివెన్నెల' 'జ్యోతి' 'విజేత' 'ఛాలెంజ్‌' వంటి లిటరేచర్‌ బేస్డ్‌ సినిమాలు తెలుగులో వచ్చినన్ని ఇతర భాషల్లో రాలేదు. ప్రపంచాన్ని షేక్‌ చేసిన 'అరుంధతి' 'బాహుబలి' వంటి సినిమాలు కూడా తెలుగులో వచ్చినవే. విభిన్నమైన కథలు చెబుదామనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను రాసుకునే సినిమాలకు కథలే హీరోలు. నా కథని నమ్మిన వాళ్లతోనే సినిమాలు చేస్తాను'' అని కరుణ కుమార్‌ చెప్పారు.

‘పలాస’ చిత్రంలో మొత్తం తెలుగువాళ్లే నటించారు. 'శ్రీదేవి సోడా సెంటర్' లో కూడా 99 శాతం తెలుగు నటులే. వంద శాతం తెలుగు న‌టీన‌టుల‌తోనే మొద‌లుపెట్టాం కానీ.. ఇందులో విల‌న్‌ గా న‌టించిన ఆర్టిస్టుకి క‌రోనా రావ‌డంతో అత‌డి స్థానంలో వేరే భాషకు చెందిన‌ న‌టుడిని తీసుకోవాల్సి వ‌చ్చింది. పది రూపాయలు ఖర్చు అయ్యే పనిని, 8 రూపాయలకే చేసి చూపించాలని నేను తపిస్తుంటాను. ఈ సినిమా విడుదల తర్వాతే తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో అనేది చెబుతాను అని దర్శకుడు కరుణ కుమార్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా విడుదల సందర్భంగా దర్శకుడు ఓ ఎమోషనల్ నోట్ రిలీజ్ చేశారు. ''సినిమా థియేటర్ ఒక ఎమోషన్. చిన్నప్పుడు అమ్మ నాన్నల ఒడిలో కూర్చొని చూసిన మొదటి సినిమా దగ్గర నుండి ఇప్పుడు నా పిల్లలతో కలిసి పాప్ కార్న్ తింటూ, జోకులేసుకుంటూ చూసే సినిమా థియేటర్ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. నేను సినిమావాడ్నయ్యాక రెండో సినిమా కూడా తీసేసాక.. నా రెండో సినిమా "శ్రీదేవి సోడా సెంటర్" కటౌట్ ను నా ఊరు పలాసలో వెంకటేశ్వర థియేటర్ దగ్గర చూసుకున్నప్పుడు కదిలిన జ్ఞాపకాల తుట్ట ఇది'' అంటూ తన ఊర్లోని థియేటర్ లో ఖైదీ నంబర్ 786 సినిమా విడుదలైన నాటి సంగతులను గుర్తు చేసుకున్నాడు.

''ఇప్పుడు అదే వెంకటేశ్వర థియేటర్ దగ్గర మన బొమ్మ కటౌట్ ను చూసుకోమని ఫ్రెండు ఫొటో పంపిచాడు. ఆ కటౌట్ ను, అధునికరించబడిన వెంకటేశ్వర థియేటర్ ను చూసాక చాలా గుర్తొచ్చింది, భావోద్వేగం కలిగింది. 'శ్రీదేవి సోడా సెంటర్' ను నేలటిక్కెట్టులో కూర్చొని శ్రీవెంకటేశ్వర థియేటర్ లో చూడాలని ఉంది. నేను త్వరలో వస్తున్నా నేలటిక్కెట్టు ఉందో లేదో? లేకపోతే ఫస్ట్ రో లో కూర్చొని చూస్తా. నేలటిక్కెట్టులో 'శ్రీదేవి సోడా సెంటర్' చూస్తే వచ్చే ఆ కిక్కే వేరు'' అని కరుణ కుమార్ రాసుకొచ్చారు.
Tags:    

Similar News