క‌మ‌ల్ సినిమా ప్రారంభానికి క్వీన్ ఎలిజిబెత్ వ‌చ్చిన వేళ‌!

Update: 2022-09-09 14:39 GMT
వృద్ధాప్య స‌మ‌స్య‌లతో ఇంగ్లండ్ మ‌హారాణి క్వీన్ ఎలిజ‌బెత్-2 మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే. ఆమె త‌న జీవిత కాలంలో మూడుసార్లు భార‌త్‌ను సంద‌ర్శించారు. 1961, 1983, 1997ల్లో దేశాన్ని సంద‌ర్శించారు. 1997లో క్వీన్ ఎలిజ‌బెత్ భార‌త్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఒక ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప్ర‌ముఖ నటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'మరుదనాయగం' సినిమా షూటింగ్ 1997లో మొద‌లైంది. ఈ సినిమాను క‌మ‌ల్ హాస‌న్ త‌న రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యాన‌ర్‌పై స్వీయ దర్శకత్వంలో అత్యంత భారీగా నిర్మించాలనుకున్నారు. ప్రముఖ నవలా రచయిత్రి సుజాతతో కలిసి ఆరేళ్ళు కష్టపడి కమల్ ఈ సినిమా స్క్రిప్టును కూడా సిద్ధం చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో 1997, అక్టోబర్‌లో చెన్నైలోని ఎంజీఆర్ ఫిల్మ్ సిటీలో మ‌రుద‌నాయ‌గం షూటింగ్ ఎంతో గ్రాండ్ గా మొద‌ల‌యింది. అయితే విశేష‌మేమిటంటే.. 'మరుదనాయగం' ప్రారంభోత్స‌వ‌ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్వీన్ ఎలిజబెత్ 2 రావ‌డం. అప్పుడు ఆమె దాదాపు 20 నిమిషాలపాటు అక్క‌డే ఉన్నారు.

త‌మ‌కోసం వ‌చ్చిన క్వీన్ ఎలిజ‌బెత్ కు ట్రీట్ ఇవ్వ‌డానికి చిత్ర యూనిట్ ఓ భారీ యుద్ధ సన్నివేశం పైలెట్ వీడియో షూట్ చేసి టీజర్ లాగా ప్రదర్శించ‌డం విశేషం. ఇందుకు ఏకంగా అప్ప‌ట్లోనే అంటే 1997లోనే రూ. 1.5 కోట్లు ఖర్చయింది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత‌ కరుణానిధి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  అప్పట్లోనే క‌మ‌ల్ హాస‌న్ ఈ సినిమాను దాదాపు రూ. 80 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించాలనుకున్నారు.

క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో ప్ర‌ముఖ న‌టులైన విష్ణువర్ధన్, అమ్రిష్ పురి, నసీరుద్దీన్ షా లాంటి ప్రముఖ నటులతో విజువల్ గ్రాండియర్ గా, ఫీస్టుగా మ‌రుదునాయ‌గంను తీసుకురావాల‌నుకున్నారు.. క‌మ‌ల్ హాస‌న్. సంగీత దర్శకుడిగా ఇళయరాజాను ఎంచుకున్నారు. అయితే ఇంత భారీ స్థాయిలో, సాక్షాత్తూ గ్రేట్ బ్రిట‌న్ మ‌హారాణి క్వీన్ ఎలిజిబెత్ స‌మ‌క్షంలో అత్యంత భారీ ఎత్తున లాంఛ్ అయిన ఈ సినిమా.. షూటింగ్ మొదలు కాకుండానే ఆగిపోయింది. దీంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. 'మరుదనాయగం' చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ముందుకొచ్చిన ఓ అంతర్జాతీయ కంపెనీ .. ఆ త‌ర్వాత అనూహ్యంగా వెనక్కి తగ్గడంతో సినిమా అర్ధంతరంగా ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.  

త‌న డ్రీమ్ ప్రాజెక్టు కావ‌డంతో ఆ త‌ర్వాత 1999లో ఈ సినిమాను తిరిగి పట్టాలెక్కించాలని కమల్ తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. అప్పుడు కూడా బడ్జెట్ సమస్యల వల్లనే చిత్రం సెట్స్ పైకి వెళ్ళలేకపోయింది. 18వ శతాబ్దానికి చెందిన గొప్ప యోధుడైన మ‌హ్మ‌ద్ యూసఫ్ ఖాన్ జీవిత చరిత్రను 'మరుదనాయగం' గా తీద్దామ‌నుకున్నారు. కానీ ఆ కల నెరవేర‌లేదు.

అయితే ఈ సినిమా కోసం కమల్ షూట్ చేసిన పైలెట్ వీడియోలోని సన్నివేశాలపై ప్రత్యేకంగా ఇళయరాజా ఓ పాటను కంపోజ్ చేశారు. దాన్ని ఒక‌ పాటగా విడుదల చేశారు. దానికి అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. మరుదనాయగం చిత్రం ముందుకు వెళ్ల‌క‌పోయిన‌ప్ప‌టికీ సినిమా లాంఛింగ్ కు 'క్వీన్ ఎలిజబెత్ 2' ముఖ్య అతిథిగా విచ్చేశారన్న విశేషం మాత్రం ఈ సినిమాకి మ‌ధుర ఘ‌ట్టంగా మిగిలిపోయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News