ప్రొడ్యూసర్ ఆఫీసుని గుల్ల చేశారు

Update: 2015-12-02 11:30 GMT
బడా బడా నిర్మాతలైనా సరే సినిమాల నిర్మాణానికి నేరుగా తమ చేతుల్లోంచి డబ్బులు పెట్టరు. అంతా ఫైనాన్సుల మీదే నడుస్తుంది వ్యవహారం. అవసరానికి డబ్బు దొరుకుతుంది కదా అని నిర్మాతలు.. అధిక వడ్డీ వస్తుందని కదా అని ఫైనాన్షియర్లు ఒకరిపై ఒకరు ఆధారపడతారు. కానీ సినిమా వ్యాపారం అనేది పెద్ద జూదం కాబట్టి ఎక్కడో ఓ చోట తేడా కొట్టడం... గొడవలు జరగడం మామూలే. వివాదాస్పద నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా ఇప్పుడు ఇలాంటి గొడవలోనే చిక్కుకున్నారు. ఓ ఫైనాన్షియర్ దగ్గర రూ.35 లక్షల అప్పు తీసుకుని.. అది చెల్లించకపోవడంతో ఈ రోజు ఆ ఫైనాన్షియర్ కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. రామకృష్ణ గౌడ్ ఆఫీసును గుల్ల చేశారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 5లో నివాసం ఉంటున్న రామకృష్ణగౌడ్ ‘ప్రతీకార జ్వాల’ అనే సినిమాను నిర్మిస్తున్నానంటూ.. నాగేశ్వరరావు అనే ఫైనాన్షియర్ వద్ద రూ.35 లక్షల అప్పు తీసుకున్నాడు. ఐతే ఆ సినిమా సగం పూర్తయ్యాక ఆగిపోయింది. దీంతో తన డబ్బులు తిరిగి ఇవ్వాలని నాగేశ్వరరావు ప్రెజర్ పెట్టాడు. ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో విసిగిపోయిన నాగేశ్వరరావు తనయుడు శివ, కుమార్తె మీనా ఫిలింనగర్‌ లోని ఆరెంజ్ హోమ్స్ అపార్ట్‌మెంట్‌ లోని రామకృష్ణగౌడ్ కార్యాలయంపై దాడిచేసి ఫర్నీచర్‌ ధ్వంసం చేశారు. తన కార్యాలయంపై దాడి చేసిన వారిపై పోలీసులకు రామకృష్ణగౌడ్ ఫిర్యాదు చేయడంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఓ సినిమాకు సంబంధించి రామకృష్ణ గౌడ్ తో హీరో ఉదయ్ కిరణ్ కు పెద్ద గొడవ జరగడం అప్పట్లో సంచలనం రేపింది.
Tags:    

Similar News