'సర్కారువారి పాట' నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్!

Update: 2022-04-18 09:40 GMT
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో 'సర్కారివారి పాట' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ - 14 రీల్స్ వారు కలిసి ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. హైదరాబాద్ .. గోవా .. దుబాయ్ ..  స్పెయిన్ లలో ఈ సినిమా చిత్రీకరణను జరుపుతూ వచ్చారు. అక్కడక్కడా ఎమోషన్ ను టచ్ చేస్తూ సాగే యాక్షన్ కామెడీ ఇది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో మహేశ్ బాబు సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది.

ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయట. ఒక పాట మినహా మిగతా పాటల చిత్రీకరణ పూర్తయినట్టుగా, ఇటీవల మేకర్స్  ప్రకటించారు. ఆ ఒక్క పాట షూటింగును హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ రోజున మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది.

ఈ పాటతో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తవుతుంది గనుక, గుమ్మడికాయ కొట్టేయడానికి  సిద్ధమవుతున్నారు. ఈ సినిమా అప్ డేట్ లో భాగంగా ఈ పాటకి సంబంధించిన పిక్స్ ను కూడా షేర్ చేయనున్నట్టు  చెబుతున్నారు.  ఇది మహేశ్ ఫ్యాన్స్ కి శుభవార్త వంటిదే.

నిజానికి ఈ సినిమా సెట్స్  పైకి వెళ్లి చాలా కాలమైంది. కరోనా కారణంగా .. మహేశ్ బాబు మోకాలు సర్జరీ కారణంగా  షూటింగు పరమైన జాప్యం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత చకచకా షూటింగును పూర్తి చేస్తూ వచ్చారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇంతవరకూ వదిలిన 'కళావతి' .. 'పెన్నీ' పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా .. లైక్స్ పరంగా ఈ పాటలు కొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ వచ్చాయి. త్వరలో మరో పాటను వదలడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

బ్యాంకు స్కామ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సముద్రఖని .. వెన్నెల కిశోర్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. మే 12వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ తరువాత మహేశ్ బాబు సినిమా త్రివిక్రమ్ తో ఉండనుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది.

అందువలన సహజంగానే అంచనాలు ఉన్నాయి. మహేశ్ సరసన నాయికగా పూజ హెగ్డేను తీసుకున్నారు. 'మహర్షి' తరువాత ఈ జంట మళ్లీ కనువిందు చేయనుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.
Tags:    

Similar News