బన్నీ - భన్సాలీ కలయిక అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ కోసమేనా..?

Update: 2022-03-15 07:36 GMT
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ సోమవారం బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ముంబయిలోని భన్సాలీ కార్యాలయానికి వెళ్తున్న బన్నీ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. వీరిద్దరి మధ్య చాలాసేపు చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.

అయితే భవిష్యత్తులో బన్నీ - బన్సాలీ ఇద్దరూ కలిసి సినిమా చేయడం కోసమే సమావేశమయ్యారా? లేక ఇంకేదైనా కారణాలతో కలిశారా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'రామాయణం' కోసమే వీరిద్దరూ భేటీ అయ్యారని ఊహాగానాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

ఇతిహాసం రామాయణం ఆధారంగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అప్పట్లో ఓ మెగా హిందీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అల్లు అరవింద్‌ - మధు మంతెన - నమిత్ మల్హోత్ర నిర్మాతలుగా.. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి మరియు 'మామ్' ఫేమ్ రవి ఉద్యవార్ దర్శకత్వంలో 3డీలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేశారు.

మూడు భాగాలుగా రూపొందించాలని భావించిన మేకర్స్.. ఫస్ట్ పార్ట్ ని 2021లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే కారణాలు తెలియదు కానీ ఇప్పటివరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరో అప్డేట్ బయటకు రాలేదు.

 ఇప్పుడు లేటెస్టుగా అల్లు అరవింద్ - మధు మంతెన మళ్లీ ఈ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచించడం ప్రారంభించారని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో బన్సాలీతో బన్నీ భేటీ అవ్వడం అనేక సందేహాలను లేవనెత్తింది. 'రామాయణం' సినిమా కోసమే అగ్ర దర్శక హీరోలు సమావేసమయ్యారని పుకార్లు పుట్టుకొచ్చేలా చేసింది.

 భన్సాలీ పీరియాడికల్ ఫిల్మ్‌ లతో సిల్వర్ స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేయగలరు. ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప' పార్ట్-1 తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. వీరిద్దరి కాంబోలో రామాయణం రూపొందించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.  

ఏదేమైనా ‘పుష్ప’ సినిమాతో బన్నీకి బాలీవుడ్ లో కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇలాంటి సమయంలో సంజయ్‌ లీలా భన్సాలీ వంటి దిగ్గజ దర్శకుడిని కలవడంతో అందరిలో ఆసక్తి పెరిగింది.

'పుష్ప' పార్ట్ 2 తర్వాత బన్నీ స్ట్రెయిట్ హిందీ సినిమా ఏమన్నా ప్లాన్ చేస్తున్నాడా అనే చర్చ మొదలైంది. మరి త్వరలోనే బన్నీ - బన్సాలీ కలయిక సారాంశం ఎంతో వెల్లడవుతుందేమో చూడాలి.
    

Tags:    

Similar News