ఇకపై డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కంటిన్యూ అవుతాడా..?

Update: 2022-10-11 01:30 GMT
టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన దర్శకుడు.. ఇటీవలి 'లైగర్' చిత్రంతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. దీని కారణంగా 'జనగణమన' ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. అయితే ఇప్పటి వరకూ తెర వెనుకే తన పనితనం చూపించిన పూరీ.. 'గాడ్ ఫాదర్' చిత్రంతో తెర మీదకు వచ్చాడు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' సినిమాలో పూరీ జగన్నాథ్ ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. ట్రైలర్ లోనే తన వాయిస్ ఓవర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన పూరీ.. సినిమాలో జర్నలిస్టుగా తన మార్కు డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. గతంలో ఆయన 'ఏమాయ చేసావే' సినిమాలో గెస్ట్ అప్పీయరన్స్ ఇచ్చారు. అలానే అప్పుడప్పుడు తన చిత్రాల్లో ఏదొక సాంగ్ లో తళుక్కున మెరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు 'గాడ్ ఫాదర్' లో కాస్త ప్రాధాన్యత ఉన్న పాత్రలో పూరీ కనిపించారు.

ఈ విధంగా నటుడు అవ్వాలనే తన కలను 'గాడ్ ఫాదర్' సినిమాతో తీర్చుకున్నాడు పూరీ జగన్నాథ్. ఇది హిట్ అవ్వడంతో ఇప్పుడు పూరీ గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇకపై ఇండస్ట్రీలో డైరెక్టర్ కమ్ యాక్టర్ గా కొనసాగాలని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ - ఎస్.జె సూర్య - అనురాగ్ కశ్యప్ వంటి దర్శకుల తరహాలోనే విభిన్నమైన రోల్స్ చేయాలని కోరుకుంటున్నారు.

అయితే 'గాడ్ ఫాదర్' తర్వాత 'ఓరి దేవుడా..!' సినిమాలోనూ పూరీ జగన్నాథ్ కనిపించబోతున్నారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లో 'బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్స్' అంటూ ఆకట్టుకున్నాడు. మరి పూరీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఆర్టిస్టుగా రాణిస్తారేమో చూడాలి.

ఇకపోతే మెగాస్టార్ 'గాడ్‌ ఫాదర్' సినిమాతో పూరీ జగన్నాథ్ నటుడిగా తన కలను సాకారం చేసుకున్నాడు కానీ.. చిరంజీవి ని డైరెక్ట్ చేయలేకపోయాననే వెలితి మాత్రం ఆయనలో అలానే మిగిలిపోయింది. నిజానికి బిగ్ బాస్ తో సినిమా చేయడానికి పూరి చాలా కాలంగా ప్రయత్నాలు చేశారు. చిరు 150వ చిత్రానికి పూరీనే దర్శకత్వం వహించాల్సింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

'ఆటోజానీ' అనే టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చేసింది. అంతా ఓకే అనుకున్న త‌రుణంలో కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా ఆగిపోయింది. దీని కంటే ముందు కూడా పూరీ పలుమార్లు క‌థ చెప్పినా ఫ‌లితం లేకుండా పోయింది. దురదృష్టవశాత్తు పూజా కార్యక్రమాలు జరిగిన త‌ర్వాత కూడా ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు 'గాడ్ ఫాదర్' లో పూరీ భాగమైన తర్వాత మరోసారి దర్శక హీరోల కాంబోపై వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ లో పూరీ జగన్నాథ్ కనిపించకపోవడంపై పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈవెంటుకు రావాలని స్వయంగా చిరు ఫోన్ చేసినా కూడా పూరీ రెస్పాండ్ అవ్వలేదని అంటున్నారు. 'లైగర్' ప్లాప్ తర్వాత ట్రోలింగ్ కు గురయ్యే అవకాశం ఉందని పబ్లిక్ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటున్నారనే పుకార్లు కూడా పుట్టుకొచ్చాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. చిరంజీవి - పూరీ కాంబోలో ఓ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి త్వరలో జగన్ కు 'మెగా' డేట్లు దొరుకుతాయేమో చూద్దాం!



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News