షోమ్యాన్ రెండు భారీ చిత్రాలను ఒకేసారి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడా..?

Update: 2022-07-29 04:35 GMT
సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ గత కొంతకాలంగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకులేకపోతున్నారు. 'రోబో' తర్వాత దర్శకుడి నుంచి వచ్చిన 'స్నేహితుడు' 'ఐ' '2.0' వంటి చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో ఇప్పుడు #RC15 పైనే శంకర్ ఆశలు పెట్టుకున్నారు.

మెగా పవర్ స్టార్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దిల్ రాజు సంస్థలో రూపొందే 50వ చిత్రం కావడంతో.. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బడ్జెట్ కు ఏమాత్రం వెనుకాడటం లేదని తెలుస్తోంది.

అందులోనూ ఇది శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి తన సత్తా ఏంటో చూపించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అంతా బాగానే ఉంటుందనుకుండగా.. గతంలో శంకర్ మధ్యలోనే ఆపేసిన 'ఇండియన్ 2' సినిమా డైరెక్టర్ పై ఒత్తిడి తెస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో శంకర్ మొదలు పెట్టిన సినిమానే 'ఇండియన్ 2'. లైకా ప్రొడక్షన్ లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్ళింది. సగానికి పైగానే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అయితే షూటింగుకు అవాంతరాలు ఎదురవ్వడం.. ఈ క్రమంలో దర్శక నిర్మాతల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. దీంతో రామ్ చరణ్ చిత్రాన్ని పట్టాలెక్కించాడు శంకర్.

తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం 'ఇండియన్ 2' ప్రాజెక్ట్ ను మళ్ళీ సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. కమల్ హాసన్ దర్శక నిర్మాతల మధ్య రాజీ కుదిర్చారని.. శంకర్ ఈ చిత్రాన్ని పూర్తి చేయడానికి అంగీకరించారని అంటున్నారు.

ఇటీవల 'విక్రమ్' మూవీ ప్రమోషన్స్ లో 'ఇండియన్ 2' పై కమల్ మాట్లాడుతూ.. రామ్ చరణ్ తో శంకర్ సినిమా పూర్తైన వెంటనే తిరిగి సెట్స్ మీదకు వెళ్తుందని చెప్పారు. ఈ గ్యాప్ లో తనో సినిమా చేసే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు RC15 పూర్తయ్యే వరకు లైకా వాళ్లు ఎదురు చూసే పరిస్థితి లేదని టాక్ నడుస్తోంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా నష్టం జరిగిందని.. అందుకే రామ్ చరణ్ చిత్రంతో సమాంతరంగా కమల్ హాసన్ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్మాతలు కోరుతున్నారట. ఈ నేపథ్యంలో ఓవైపు RC15 చేస్తూనే.. మరో వైపు 'ఇండియన్ 2' షూటింగ్ చేసేలా శంకర్ ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం దిల్ రాజు ను ఒప్పించేందుకు దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నారే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

రామ్ చరణ్ చిత్రాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వచ్చే సమ్మర్ నాటికి రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేసుకున్నారు. అందుకే 'వారసుడు' సినిమాని సంక్రాంతి బరిలోకి తీసుకొస్తున్నారు. కానీ ఇప్పుడు శంకర్ రెండు భారీ చిత్రాలను ఒకేసారి చేస్తానంటే.. అనుకున్న సమయానికి పూర్తవడం సాధ్యపడకపోవచ్చు. అంతేకాదు అవుట్ ఫుట్ ఆశించిన విధంగా వస్తుందో లేదో చెప్పలేం. దీనికి తోడు వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే శంకర్ 'అపరిచితుడు' హిందీ రీమేక్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శంకర్ నిర్ణయాన్ని దిల్ రాజు అంగీకరిస్తారో లేదో చూడాలి.
Tags:    

Similar News