విజయ్ దేవరకొండ సక్సెస్ రేట్ అంతేనా ?

Update: 2022-07-04 06:26 GMT
కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నారు. 2011లో 'నువ్విలా' సినిమాతో తెరంగేట్రం చేసిన VD.. ఆ తర్వాత 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రంలో కనిపించాడు. 2015లో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో సపోర్టింగ్ రోల్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో 2016లో 'పెళ్లిచూపులు' మూవీతో హీరో అవతారమెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు

'అర్జున్ రెడ్డి' చిత్రంతో యూత్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు విజయ్ దేవరకొండ. దీని తర్వాత అర డజను సినిమాల్లో నటించిన వీడీ.. కొన్ని చిత్రాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేశారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైన్ లో పెడుతున్నారు. అయితే ఇప్పుడు లైగర్ న్యూడ్ పోస్టర్ రిలీజ్ చేసాక సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున విజయ్ గురించి చర్చ జరుగుతుంది . విజయ్ చేసిన  సినిమాలు హిట్స్ కంటే ఫెయిల్యూర్ లు ఎక్కువ అని, విజయ్ వల్ల టాలీవుడ్ నష్టాల్లో ఉందని సోషల్ మీడియాలో ఒక వర్గం సినిమా జనాలు చర్చలు జరుపుతున్నారు..

VD కెరీర్ లో 'పెళ్లి చూపులు' 'అర్జున్ రెడ్డి' మరియు 'గీత గోవిందం' వంటి మూడు సినిమాలను హిట్స్ గా ట్రేడ్ వర్గాలు పరిగణిస్తారు. కాకపోతే 'పెళ్లి చూపులు' మూవీ సక్సెస్ క్రెడిట్ లో మేజర్ పార్ట్ మాత్రం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసుకెళ్లిపోయారు. 'అర్జున్ రెడ్డి' 'గీత గోవిదం' సినిమాలు మాత్రమే క్లీన్ హిట్స్ గా నిలిచాయి. మధ్యలో 'మహానటి' మూవీ కూడా విజయం సాధించింది కానీ.. అది విజయ్ ఖాతాలో వేయలేం.

ఇక 'ద్వారక' 'ఏమంత్రం వేశావే' పరాజయం చవిచూడగా.. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ద్విభాషా చిత్రం 'నోటా' డిజాస్టర్ అయింది. దీని తర్వాత వచ్చిన 'టాక్సీవాలా' 'డియర్ కామ్రేడ్' సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. రెండేళ్ల క్రితం మంచి అంచనాలతో వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' భారీ డిజాస్టర్ గా నిలిచింది.

ఇలా విజయ్ దేవరకొండ కెరీర్ లో సినిమాల్లో మూడు మాత్రమే హిట్టవ్వగా.. మిగతా ఆరు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. సినిమాలు ప్లాప్ అవ్వడం తో నిర్మాతలు తీవ్రంగా నష్టపోవడమే కాకుండా.. టాలీవుడ్ నష్టాల్లోకి రావడానికి కారణమయ్యారని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సినిమాలతో కంటే రియల్ లైఫ్ యాటిట్యూట్ తోనే విజయ్ దేవరకొండ ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్నాడని అంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియాలో తెచ్చుకున్న ఫాలోయింగ్ తోనే ఆఫర్స్ అందుకుంటున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా చివరగా 'వరల్డ్ ఫేమస్ లవర్' తో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న VD.. ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాల్సిన అవసరం ఏర్పడింది.

రౌడీ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో కలిసి పూరీ - ఛార్మీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా వదిలిన విజయ్ న్యూడ్ పోస్టర్ ట్రోలింగ్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

ఇకపోతే పూరీ జగన్నాథ్ మరియు విజయ్ కాంబినేషన్ లో 'JGM' అనే మరో పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత తో కలిసి 'ఖుషీ' అనే సినిమా చేస్తున్నాడు వీడీ. షూటింగ్ దశలో ఉన్న ఈ రొమాంటిక్ లవ్ స్టొరీని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయనున్నారు. ప్రెజెంట్ విజయ్ నటిస్తున్న ఈ మూడు సినిమాలు అతని కెరీర్ ను ఏ స్థాయికి తీసుకెళ్తాయో చూడాలి.
Tags:    

Similar News