డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు ఆ సినిమాలపైనే..!

Update: 2022-03-19 10:30 GMT
‘బాహుబలి’ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్, రేంజ్ ఒక్కసారిగా మారిపోయాయి. టాలీవుడ్ స్టార్ హీరో కాస్తా పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు. దీంతో డార్లింగ్ నుంచి వచ్చే ప్రతీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. అవి ఆ స్థాయిలో లేకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు.

మూడేళ్ళ క్రితం ఎన్నో అంచనాలు పెట్టుకున్న 'సాహో' సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. ఇటీవల థియేటర్లలోకి వచ్చిన 'రాధేశ్యామ్' సినిమా మెజారిటీ వర్గాన్ని మెప్పించలేకపోయింది. పీరియాడిక్ లవ్ స్టొరీకి ఫ్యాన్స్ కూడా కనెక్ట్ కాలేదు. విజువల్ గ్రాండియర్ గా ఉన్నప్పటికీ.. రెండో వారానికి థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.

'సాహో' లో బలహీనమైన కంటెంట్ ఉన్నప్పటికీ, యాక్షన్ ప్రియులను ఆకట్టుకోవడంతో నార్త్ లో మంచి వసూళ్ళు రాబట్టింది. కానీ 'రాధే శ్యామ్' విషయంలో అలా జరగకపోవడంతో వారం రోజులకే ఉత్తరాదిలో దాదాపు వాష్ ఔట్ అయ్యే పరిస్థితి వచ్చింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ ఆశించిన ఫ్యాన్స్ తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ క్రమంలో మరో ప్లాప్ పడితే అగ్ర హీరో ఫేమ్ కు ఇబ్బందే.

అందుకే ఎలాగైనా తదుపరి చిత్రాలతో డార్లింగ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. 'ఆదిపురుష్' - 'సలార్' 'ప్రాజెక్ట్ K' 'స్పిరిట్'.. ఇలా క్రేజీ కాంబినేషన్స్ లో వందల కోట్ల బడ్జెట్లలో రూపొందే సినిమాలున్నాయి. అలానే 'రాజా డీలక్స్' అనే చిత్రాన్ని త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది.

వీటిల్లో ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న 'ఆదిపురుష్' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఇది అందరికీ తెలిసిన ఎన్నో సార్లు చూసిన రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోన్న సినిమా.   3డీ టెక్నాలజీలో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు.

'ఆదిపురుష్' కథ పరంగా కొత్తగా ఎగ్జైట్ చేసేది కాకపోయినా.. నార్త్ లో ఈ సినిమాకు విశేషమైన ఆదరణ లభించే అవకాశం ఉంది. 'రాధేశ్యామ్' బాలీవుడ్ లో దారుణమైన ఫలితాన్ని చవిచూడటంతో.. ఈ మైథిలాజికల్ చిత్రంతో సత్తా చాటే ఛాన్స్ ఉంటుందనే అభిప్రాయాలు అభిమానుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.

ఇక నాగ్ అశ్విన్ తో చేస్తున్న 'ప్రాజెక్ట్ కే' - సందీప్ రెడ్డి వంగా తో చేయాల్సిన 'స్పిరిట్' సినిమాలు ఇప్పుడప్పుడే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం లేదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'సలార్' మూవీ కొంత మేర షూటింగ్ జరుపుకుంది. దర్శకుడు 'కేజీఎఫ్' రేంజ్ లో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతారని అందరూ భావిస్తున్నారు.

'సలార్' లో ఫ్యాన్స్ కోరుకునే యాక్షన్ సీన్స్ - ఎలివేషన్లు మెండుగా ఆశించవచ్చు. నార్త్ సర్క్యూట్ లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మధ్యలో మారుతీతో ఓ హారర్ కామెడీ చేస్తున్నారని అంటున్నారు కానీ.. ప్రభాస్ ఇమేజ్‌ ను మ్యాచ్ చేసే సినిమాను అందించగలడా లేదా అనే సందేహాలు ఉన్నాయి.

అందుకే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఇప్పుడు 'ఆదిపురుష్' 'సలార్' చిత్రాలపైనే ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఈ ఏడాది చివర్లో.. మరొకటి వచ్చే ఏడాది వేసవిలో లేదా ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశముంది. ఎప్పుడు వచ్చినా ఈ రెండు సినిమాలతో డార్లింగ్ మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ కు తన స్టామినా ఏంటో చూపిస్తారని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Tags:    

Similar News