ప‌వ‌న్ కు స‌హాయం చేయ‌నంటున్న త్రివిక్ర‌మ్ ?

Update: 2022-03-17 02:30 GMT
ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ మ‌ధ్య మంచి స్నేహ బంధం వుంద‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. 'జ‌ల్సా' నుంచి వీరి అనుబంధం కొన‌సాగుతోంది. ప‌వ‌న్ సెకండ్ ఇన్నింగ్స్ ని దాదాపు మూడున్న‌రేళ్ల విరామం త‌రువాత 'వ‌కీల్ సాబ్‌'తో తిరిగి ప్రారంభించారు. ఈ చిత్రానికి బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్‌' ఆధారం. ఈ రీమేక్ లో న‌టించ‌మ‌ని ప‌వ‌న్ కు స‌ల‌హా ఇచ్చింది త్రివిక్ర‌మ్. ఆయ‌న వ‌ల్లే ప‌వ‌న్ 'వ‌కీల్ సాబ్‌' రీమేక్ లో న‌టించారన్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌కు త‌ప్ప చాలా మందికి తెలియ‌దు.

ఇటీవ‌ల ప‌వ‌న్ న‌టించిన మ‌రో రీమేక్ 'భీమ్లా నాయ‌క్‌'. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్‌' ఆధారంగా తెర‌కెక్కించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ ప్ర‌త్య‌క్ష్యంగా ప‌ని చేశారు. సాగ‌ర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీకి త్రివిక్ర‌మ్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించిన విష‌యం తెలిసిందే. సీతార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది.  

ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో రీమేక్ చిత్రంలో న‌టించ‌డానికి రెడీ అయిపోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ రీమేక్ ని నిర్మించ‌బోతున్నాయి. స‌ముద్ర‌ఖ‌ని న‌టించిన తెర‌కెక్కించిన తమిళ చిత్రం 'వినోదాయ సితం'. ఇదే చిత్రాన్ని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలుగులో రీమేక్ చేయ‌బోతున్నారు. స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేయ‌నున్న ఈ చిత్రంలోని కీల‌క పాత్ర‌లో మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించ‌బోతున్నార‌ని ఇప్ప‌టికే వార్తులు వినిపిస్తున్నాయి.

'భీమ్లానాయ‌క్‌' కు కథా మార్పుల‌తో పాటు మాట‌లు, స్క్రీన్ ప్లే అందించిన స్టార్ డైరెక్ట‌ర్‌ త్రివిక్ర‌మ్ తాజా రీమేక్ కోసం కూడా ప‌ని చేయ‌బోతున్నార‌ని, ఇందు కోసం ఆయ‌న 10 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తున్నారంటూ వ‌రుస‌ క‌థ‌నాలు విపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే త్రివిక్ర‌మ్ మాత్రం ఆస‌క్తిని చూపించ‌డం లేద‌ని తాజాగా వినిపిస్తోంది. ఆయ‌న‌కు ప‌వ‌న్ అప్పగించిన బాధ్య‌త‌ల్ని మ‌రో ర‌చ‌యిత‌కు అప్ప‌గించాల‌నే ఆలోచ‌న‌లో త్రివిక్ర‌మ్ వున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

త్రివిక్ర‌మ్ ఇలా ప‌వ‌న్ కు స‌హాయం చేయ‌కుండా ప‌క్క‌కు త‌ప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తుండ‌టానికి ప్ర‌ధాన కార‌ణం మ‌హేష్ బాబు సినిమా. ఎన్టీఆర్ 30 వ చిత్రం త‌న నుంచి కొర‌టాల శివ‌కు వెళ్ల‌డంతో ఆ స్థానంలో మ‌హేష్ బాబు చిత్రాన్నిత్రివిక్ర‌మ్ ప్ర‌క‌టించారు. ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ పూజా కార్యక్ర‌మాల‌ని మ‌హేష్ లేకుండానే పూర్తి చేశారు. 'స‌ర్కారు వారి పాట‌' పూర్త‌యిన మరుక్ష‌ణం ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని త్రివిక్ర‌మ్ రెడీ అవుతున్నారు.

 ఈ ద‌శ‌లో ప‌వ‌న్ రీమేక్ కోసం వ‌ర్క్ చేసేంత స‌మ‌యం త్రివిక్ర‌మ్ కు లేదు. ఆ కార‌ణంగానే ప‌వ‌న్ అప్ప‌గించిన ప‌నిని త్రివిక్ర‌మ్ చేయ‌లేన‌ని ఆ బాధ్య‌త‌ల్ని సాయి మాధ‌వ్ బుర్రాకు అప్ప‌గించాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టికే ఆయ‌న‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News