బన్నీని మాత్రం వదిలేది లేదంటున్న తమిళ డైరెక్టర్!

Update: 2022-07-13 17:30 GMT
ఇప్పుడు ట్రెండ్ చాలా మారిపోయింది. ఒక వైపున స్టార్ హీరోలు వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తుంటే, మరో వైపున డైరెక్టర్లు కూడా వరుసగా హీరోల డేట్స్ తీసుకుంటున్నారు. ఎవరూ కూడా ఖాళీగా లేకుండా పరుగుపందెంలో పాల్గొంటూనే ఉన్నారు. తెలుగు దర్శకులు తమిళ హీరోల వైపు వెళుతుంటే, కోలీవుడ్ డైరెక్టర్లు టాలీవుడ్ హీరోలను సెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళ దర్శకుడు లింగుసామి తన తాజా చిత్రాన్ని రామ్ తో చేశాడు. 'ది వారియర్' పేరుతో రూపొందిన ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించాడు. రేపు ఈ సినిమా  థియేటర్లకు రానుంది.

అయితే రామ్ తో లింగుసామి చేసిన ఈ కథ, గతంలో బన్నీకి వినిపించినదే అనే ఒక ప్రచారం ఊపందుకుంది. బన్నీ ఓజీగా ఉండటం వలన అదే కథను రామ్ కి చెప్పి  ఒప్పించినట్టుగా టాక్ నడుస్తోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ ప్రచారానికి లింగుసామి తెరదింపే ప్రయత్నం చేశారు. "బన్నీతో నేను ఒక  సినిమా చేయాలనుకోవడం .. ఆయనకి ఒక కథ వినిపించడం నిజం. కాకపోతే ఆ కథ వేరు .. దాని ట్రీట్మెంట్ వేరు. నేను రామ్ తో చేసిన సినిమా కథ వేరు. ఈ సినిమాకి సంబంధించిన ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు.

 బన్నీతో చేయాలనుకున్న ప్రాజెక్టు కొన్ని కారణాల వలన కుదరలేదు. అలా అని చెప్పేసి ఆ ప్రాజెక్టు ఆగిపోయినట్టు కాదు. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను. బన్నీ స్టైల్ ..  ఆయన యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం.

టాలీవుడ్ లో నేను ఎంతో అభిమానించే హీరోల్లో ఆయన ఒకరు. అలాంటి బన్నీతో తప్పకుండా సినిమా చేస్తాను. ఈ సినిమా తరువాత నేను అదే పనిలో ఉంటాను. ఇక ఎన్టీఆర్ .. మహేశ్ బాబులతోను సినిమాలు చేయాలనుకుంటున్నాను. వాళ్ల బాడీ లాంగ్వేజ్ కీ .. ఇమేజ్ కి తగిన కథలను రెడీ చేసుకుంటాను" అని చెప్పుకొచ్చారు.

నిజం చెప్పాలంటే లింగుసామి తమిళంలో ఒకప్పుడు మంచి హిట్స్ ఇచ్చారు. ఆ తరువాత కాలంలో ఫ్లాపులు క్యూ కట్టడంతో, సహజంగానే అక్కడి స్టార్లు ముఖం చాటేశారు. దాంతో ఆయన టాలీవుడ్ లో తన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆయన చేసిన 'ది వారియర్' పైన మంచి అంచనాలు అయితే ఉన్నాయి. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. బన్నీలతో చేయాలనే ఉత్సాహంతో ఆయన ఉన్నారు. కానీ అవన్నీ జరగాలంటే ముందు రామ్ సినిమా థియేటర్స్ లో రచ్చ చేయాలి. మరి ఆ స్థాయి రచ్చ జరుగుతుందా లేదా అనేదే చూడాలి.
Tags:    

Similar News