ఆ దర్శకుడి పనితీరుకు మోహన్ లాల్ ఫిదా

Update: 2016-06-06 13:30 GMT
టాలీవుడ్ విలక్షణ దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. యేలేటి ఎప్పుడూ మీడియాలో కనిపించడు.. పబ్లిక్ ఫంక్షన్లకు రాడు.. తన సినిమాల కార్యక్రమాలకు వచ్చినా పెద్దగా మాట్లాడడు. అతనేమీ మాట్లాడకపోయినా.. అతడి సినిమాలే అతనేంటో చెబుతాయి. ఐతే.. అనుకోకుండా ఒకరోజు.. ఒక్కడున్నాడు.. ప్రయాణం.. సాహసం.. ఇలా తాను తీసిన ప్రతి సినిమాలోనూ వైవిధ్యం చూపించి తన ప్రత్యేకత చాటుకున్నాడు యేలేటి.

దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కేవలం ఐదు సినిమాలే తీసిన యేలేటి.. ‘సాహసం’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘మనమంతా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మోహన్ లాల్ ఇన్నేళ్ల కెరీర్లో తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించడానికి ముందుకొచ్చింది ఈ సినిమాతోనే. దీని తర్వాతే ‘జనతా గ్యారేజ్’ కూడా ఒప్పుకున్నాడు. మోహన్ లాల్ ను మెప్పించాడంటే ఆ కథలో కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకత ఉండే ఉంటుంది.

ఇక షూటింగ్ సందర్భంగానూ తన పనితీరుతో మోహన్ లాల్ ఫిదా అయిపోయేలా చేశాడట యేలేటి. ఈ విషయాన్ని స్వయంగా మోహన్ లాలే ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పాడు. యేలేటి వర్కింగ్ స్టైల్ తనకు చాలా బాగా నచ్చిందని.. అతను స్క్రిప్టు మీద పట్టు.. చాలా క్లారిటీ ఉన్న దర్శకుడని కితాబిచ్చాడు మోహన్ లాల్. ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్న తాను యేలేటి పనితీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యానని అన్నాడు మలయాళ సూపర్ స్టార్. మోహన్ లాల్ తో పాటు గౌతమి.. విశ్వాంత్ (కేరింత ఫేమ్) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మనమంతా’ జులైలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. సాయి కొర్రపాటి నిర్మాత.
Tags:    

Similar News