షారుఖ్ మేనేజర్ పూజా దడ్లానీకి ముంబై పోలీసుల సమన్లు

Update: 2021-11-16 10:32 GMT
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ను డ్రగ్స్ కేసు వీడడం లేదు. ఆయన కుమారుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ఈ కేసులో జైలు పాలయ్యారు. ఇప్పుడు షారుఖ్ మేనేజర్ వంతు వచ్చింది. షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దడ్లానీకి ముంబై పోలీసులు రెండోసారి సమన్లు జారీ చేశారు.

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ముంబై పోలీసులు షారుఖ్ మేనేజర్ పూజాకు తాజాగా రెండోసారి సమన్లు జారీ చేశారు. ఈ డ్రగ్స్ కేసులో అక్రమ వసూళ్ల కోణంపై ముంబై పోలీసులు ఇప్పటికే 20 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు.

విచారణకు హాజరు కావడానికి పూజా దడ్లానీ మరికొంత సమయం అడిగిన దృష్ట్యా పోలీసులు మూడో సమన్లు కూడా జారీ చేసే అవకాశం ఉంది.

డ్రగ్స్ కేసులో ముడుపుల చెల్లింపు ఆరోపణలపై శామ్ డిసౌజా సోమవారం ముంబై ప్రత్యేక పోలీసుల బృందం (సిట్) ముందు హాజరయ్యారు. ఆర్యన్ ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసిన తర్వాత ఎన్సీబీ సాక్షి కేపీ గోసావి డిసౌజాతో రూ.25 కోట్ల పే ఆఫ్ డీల్ గురించి ఫోన్ లో చర్చిస్తున్నట్టు తాను విన్నానని స్వతంత్ర సాక్షి ప్రభాకర్ సెయిల్ పేర్కొన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ముంబై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. ఎన్సీబీ విజిలెన్స్ బృందం ఇప్పటికే డిసౌజా వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

డిసౌజా బాంబే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. షారుఖ్ మేనేజర్ పూజా దడ్లానీ నుంచి గోసావి రూ.50 లక్షలు తీసుకున్నట్లు ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆర్యన్ అరెస్ట్ తర్వాత ఈ మొత్తాన్ని తిరిగి ఇచ్చారని దరఖాస్తులో పేర్కొన్నారు.
Tags:    

Similar News