జీఏ2 లో రష్మిక భారీ బడ్జెట్ సినిమా..?

Update: 2022-04-11 08:30 GMT
టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌసెస్ లలో గీతా ఆర్ట్స్ ఒకటి. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ చిత్రాలను కూడా నిర్మిస్తూ గత కొన్నేళ్లుగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ - సూపర్ హిట్స్ అందుకున్నారు నిర్మాత అల్లు అరవింద్. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ కు అనుబంధ సంస్థగా 'గీతా ఆర్ట్స్ 2 పిక్చర్స్' బ్యానర్ ను స్థాపించారు నిర్మాత బన్నీ వాసు.

'100% లవ్' సినిమాతో నిర్మాతగా ఘనవిజయం సాధించిన బన్నీ వాస్.. జీఏ2 పిక్చర్స్ పతాకంపై ఇప్పటి వరకు అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అక్కినేని నాగచైతన్య - నాని - విజయ్ దేవరకొండ - అఖిల్ అక్కినేని - సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలకు హిట్లు అందించారు.

అల్లు అరవింద్ సమర్పణలో ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో 'భలే భలే మగాడివోయ్', 'గీత గోవిందం', 'టాక్సీవాలా', 'ప్రతిరోజు పండగే' 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' వంటి సూపర్ హిట్ సినిమాలు రూపొందించబడ్డాయి. ఇలా వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న వాసు.. మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.

అయితే ఇప్పుడు తన నిర్మాణంలో హై బడ్జెట్ సినిమాలతో పాటుగా చిన్న చిత్రాలు.. మీడియం రేంజ్ సినిమాలను కూడా తీయాలని నిర్మాత ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం GA2 పిక్చర్స్ బ్యానర్ లో నాలుగు మీడియం రేంజ్ సినిమాలతో పాటుగా ఓ పెద్ద చిత్రం నిర్మించబడుతున్నాయి.

గోపీచంద్ - రాశీఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో 'పక్కా కమర్షియల్' అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ తో కలిసి బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీని 2022 జులై 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అలానే అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యూయేల్ హీరోహీరోయిన్లుగా రాకేష్ శశి దర్శకత్వంలో 'ప్రేమ కాదంట' అనే న్యూ ఏజ్ రొమాంటిక్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇక నిఖిల్ సిద్ధార్థ్ - అనుపమ పరమేశ్వరన్ జంటగా '18 పేజెస్' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. దీనికి దర్శకుడు సుకుమార్ ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే అందిస్తుండటం విశేషం. ఈ మూవీని సమ్మర్ లోనే రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కిరణ్ అబ్బవరం హీరోగా 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. లేటెస్టుగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఇకపోతే స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో బన్నీ వాస్ ఓ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం రష్మిక భాషతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా వుంది. ఆమె లైనప్ లో హిందీ తెలుగు తమిళ చిత్రాలతో పాటుగా పాన్ ఇండియా మూవీస్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్2 లో ఓ మూవీ చేయడానికి అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇలా గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. మరి వీటిలో ఏవేవి నిర్మాత బన్నీ వాసు కు విజయాలను అందిస్తాయో చూడాలి.
Tags:    

Similar News