పూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు షాకిచ్చిన పృథ్వీరాజ్‌

Update: 2022-03-08 04:39 GMT
పూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఉన్న‌ట్టుండి బిగ్ షాకిచ్చాడు. `లైగ‌ర్‌` త‌రువాత డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న పూరి జ‌గ‌న్నాథ్ కు ఇది ఊహించ‌ని షాక్ గా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ `ఇస్మార్ట్ శంక‌ర్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేశారు. ఈ మూవీ అందించిన స‌క్సెస్ జోష్ తో రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఆయ‌న `లైగ‌ర్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలో హాలీవుడ్ స్టార్ , వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ బాక్స‌ర్ మైక్ టైస‌న్ ఈ చిత్రంలోని కీల‌క అతిథి పాత్ర‌లో న‌టిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంత‌ర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్ప‌డింది. ఆ క్రేజ్ కి త‌గ్గ‌ట్టే ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రూపొందుతున్న ఈ మూవీని త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు.

ఇదిలా వుంటే ఈ మూవీ పూర్త‌యిన వెంట‌నే ద‌ర్శ‌కుడు పూరి జ‌గన్నాథ్ త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ ని కూడా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో చేయ‌బోతున్నారు. ఇందు కోసం ఇప్ప‌టికే ప్లాన్ ని సిద్ధం చేసుకున్న ఆయ‌న ఇత‌ర దేశాల్లో ఫ‌స్ట్ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా పూజా గ‌న్నాథ్ తెర‌పైకి తీసుకురావాలనుకుంటున్న ప్రాజెక్ట్ `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. ఇదే చిత్రాన్ని త్వ‌ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నారు.

డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డంతో చాలా రోజులుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్న పూరి జ‌గ‌న్నాథ్ కు తాజాగా మ‌ల‌యాళ హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ షాకిచ్చాడు. త‌ను హీరోగా మ‌ల‌యాళంలో `జ‌న‌గ‌ణ‌మ‌న‌` పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. ఇప్పుడిది పూరి జ‌గ‌న్నాథ్ కు బిగ్ షాక్ గా మారిన‌ట్టు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ నిర్మాణ ద‌శ‌లో వుంది. ఇదే కాకుండా త‌మిళంలో జ‌యం ర‌వి, తాప్సీ జంట‌గా రూపొందుతున్న చిత్రానికి కూడా ఇదే టైటిల్ ని ఫైన‌ల్ చేశారు. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీ ఈ ఏడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇదిలా వుంటే పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌` చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో పాటు ప్రోమో కూడా విడుద‌ల కావ‌డంతో ఇప్పుడు పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ప‌రిస్థితి ఏంట‌నే వాద‌న వినిపిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టిస్తున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌` ఏప్రిల్ 28న విడుద‌ల కాబోతోంది.

ఇటీవ‌లే రిలీజ్ డేట్ పోస్ట‌ర్ ని కూడా టీమ్ విడుద‌ల చేసింది. పూరి - విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ట్ చేయబోతున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌` పాన్ ఇండియా ప్రాజెక్ట్‌. ఇది ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ఈ నేప‌థ్యంలో ఒకే టైటిల్ తో ఇప్ప‌టికే రెండు చిత్రాలు సెట్స్ పై వుండ‌టం పూరిని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. మ‌రి దీనిపై పూరి జ‌గ‌న్నాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు.
Tags:    

Similar News