తెలుగు రాష్ట్రాల్లో తొలి మొబైల్ థియేటర్ లో 'ఆచార్య'తో రెగ్యులర్ షోలు

Update: 2022-04-26 05:44 GMT
టెక్నాలజీ ఎంట్రీ ఇస్తే ఏ రంగంలో అయినా మార్పులు సహజమే. కాలానికి అనుగుణంగా.. అందుబాటులోకి వచ్చిన సాంకేతికతను అందిపుచ్చుకొని ప్రజలకు వినోదాన్ని అందించటం తెలిసిందే. అప్పుడెప్పుడో డేరాల్లో సినిమాలు వేసే వారన్న మాటను వింటుంటాం.

ఇప్పుడు దాని స్థానే భారీ భవంతుల్లో కళ్లు చెదిరే ఇంటీరియర్ తో రిలాక్స్ డ్ గా కూర్చునేందుకు వీలుగా ఉన్న కుర్చీలతో థియేటర్లు బోలెడన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటివేళ... తిరిగి లగ్జరీ డేరాలు రావడం ఇపుడు తాజా వింత.

దీనికి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వేదికగా మారింది. స్థానిక జీఎస్ఎల్ మెడికల్ కాలేజీకి దగ్గర్లో హెబిటేట్ రెస్టారెంట్ వేదిక అయ్యింది. ఇక్కడ ఒక ఆధునిక మొబైల్ థియేటర్ ను ఏర్పాటు చేశారు. పిక్చర్ టైమ్స్ సంస్థ ఏర్పాటు చేసిన ఈ మొబైల్ థియేటర్ కారణంగా.. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఐమాక్స్ లో సినిమా చూసిన ఫీలింగ్ కలిగేలా చేయటమే దీని ప్రత్యేకతగా చెప్పొచ్చు.

గాలితో నింపిన టెంట్.. ఇంగ్లిషులో చెప్పాలంటే ఇన్ ప్లాటబుల్ అకోస్టిక్ మెటీరియల్ తో తయారు చేసిన ఈ థియేటర్.. అన్ని వాతావరణ పరిస్థితులకు.. అగ్నిప్రమాదాలకు తట్టుకొని నిలిచేలా దీన్ని సిద్ధం చేశారు.

35 ఎంఎం స్క్రీన్ తో.. 120 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన ఈ థియేటర్ కు ఏడాది పాటు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ థియేటర్ లో సినిమా చూసేందుకు ఆన్ లైన్ లోనే కాదు.. ఆఫ్ లైన్ లోనూ టికెట్లను తీసుకునే వీలుంది.

ఇక.. ఈ థియేటర్ లో మెగాస్టార్ చిరంజీవి.. ఆయన తనయుడు రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీతో రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఇప్పటివరకు చూసిన థియేటర్లకు పూర్తి భిన్నంగా ఉండే ఈ సినిమా థియేటర్ లో సినిమాను చూడటం విచిత్రమైన అనుభూతిని సొంతం చేసుకోవటం ఖాయమంటున్నారు. తాజా ప్రయోగం ఫలిస్తే.. రానున్న రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి థియేటర్లు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందన్న  అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News