భీమ్లా క్రేజ్‌..దండుకుంటున్న అధికార పార్టీ నేత‌

Update: 2022-02-25 03:48 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ విశ్వ‌రూపం చూడాల‌ని చాలా కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి ఆక‌లిని తీర్చే సినిమాగా `భీమ్లా నాయ‌క్‌`ని ఇప్ప‌టికే ఫ్యాన్స్ అభివ‌ర్ణిస్తున్నారు. `గ‌బ్బ‌ర్ సింగ్‌` త‌రువాత అంత‌కు మించి మాస్ పాత్ర‌లో ప‌వ‌న్ ని చూడ‌ని అభిమానులు ఈ సినిమాతో ఆ లోటు తీర‌బోతోంద‌ని సంబ‌రాలు మొద‌లుపెట్టారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `భీమ్లా నాయ‌క్‌` ఈ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే.

గ‌త కొన్ని రోజులుగా రిలీజ్ సందిగ్ధంలో వున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌కు నోచుకుంది. అయితే ఈ మూవీ చుట్టూ ఏపీలో రాజ‌కీయం మొద‌లైంది. గ‌త కొంత కాలంగా జ‌న‌సేనానికి ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ కి మ‌ధ్య ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ప‌వ‌న్ సినిమా ఎప్పుడెప్పుడు థియేట‌ర్ల‌లోకి వ‌స్తుందా? అని ఎదురుచూసిన ప్ర‌భుత్వం సినిమా థియేట‌ర్ల‌లోకి రాగానే కొత్త ఆంక్ష‌ల్ని మొద‌లుపెట్టింది. ప్ర‌త్యేకంగా వీఆర్వోల‌ని రంగంలోకి దించి ప్ర‌తీ థియేట‌ర్ ని టికెట్ రేట్ల విష‌యంలో చెక్ చేయ‌డం మొద‌లు పెట్టింది.

దీనిపై ఫ్యాన్స్ ఇప్ప‌టికే ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయినా ప్ర‌భుత్వం మాత్రం ఇవ‌న్నీ త‌న‌కు ప‌ట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, క‌క్ష సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం టికెట్ ల‌కు సంబంధించిన నిబంధ‌న‌ల్ని ముంద‌కు తీసుకొచ్చింద‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా అధిక ధ‌ర‌ల‌కు టికెట్లు అమ్మ‌రాదని, బెనిఫిట్ షోను ప్ర‌వ‌ర్శించ‌కూడ‌ద‌ని ఏపి ప్ర‌భుత్వం `భీమ్లా నాయ‌క్‌` రిలీజ్ కి ముందు క‌ఠిన నిబంధ‌న‌ల‌ని అమ‌ల్లోకి తీసుకొచ్చింది.
 
అయితే ఈ నిబంధ‌న‌ల్ని సొంత పార్టీ నేత ప‌ట్టించుకోవ‌డం లేదు. ప‌వన్ క్రేజ్ ని క్యాష్ చేసుకునే ప‌నిలో భాగంగా త‌న థియేట‌ర్ లో ఒక్కొ టికెట్ ని రూ. 300కు య‌థేచ్ఛ‌గా విక్ర‌యిస్తూ సొమ్ము చేసుకుంటుండ‌టం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. సొంత పార్టీ నిబంధ‌న‌ల్నే ప‌క్క‌న పెట్టేసి రూల్స్ తన‌కు కాదంటూ వైఎస్సార్ సీపీ నేత వ్య‌వ‌హ‌రించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ‌కు చెందిన అధికార పార్టీ నేత‌కు చెందిన ఓ థియేట‌ర్ వుంది. అందులో భీమ్లా నాయ‌క్‌` ని విడుద‌ల చేశారు. అయితే ఒక రోజు ముందు నుంచే స‌ద‌రు వైసీపీ నేత‌కు చెందిన థియేట‌ర్ లో టికెట్ ల‌ని అధిక ధ‌ర‌ల‌కు విక్ర‌యించారని తెలిసింది. దీంతో మీకు మాత్రం రూల్స్ వ‌ర్తించ‌వు కానీ మిగ‌తా వారికి మాత్రం రూల్స్ వ‌ర్తిస్తాయా? అని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు.  ఇదిలా వుంటే `భీమ్లా నాయ‌క్‌` రిలీజ్ సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల‌ని ఖ‌చ్చితంగా అమ‌లు ప‌ర‌చాల‌ని, థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తుండ‌టం, సొంత పార్టీ వారు మాత్రం ఆ నిబంధ‌న‌ల్ని ప‌క్క‌న పెడితే ప‌ట్టించుకోక‌పోవ‌డం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News