ఓటీటీలో ఎంట్రీ ఇవ్వబోతున్న సెన్సేషనల్ డైరెక్టర్..?

Update: 2022-02-06 03:35 GMT
డిజిటల్ వేదికలు వచ్చిన తర్వాత ఫిలిం మేకర్స్ అందరూ సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. సినిమాలతోనే కాకుండా వెబ్ కంటెంట్ తోనూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. భవిష్యత్తులో వెబ్ కంటెంట్ హవానే కొనసాగబోతోందని భావిస్తున్న తరుణంలో టాలీవుడ్ నుంచి ఇప్పటికే అనేకమంది దర్శక రచయితలు.. నిర్మాతలు - నటీనటులు డిజిటల్ వరల్డ్ లోకి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

'RX100' సినిమాతో డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి.. విభిన్నమైన కథ కథనాలతో వైలెంట్ లవ్ డ్రామాని ప్రేక్షకులకు అందించారు. ఫస్ట్ మూవీతోనే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అందుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. దీంతో దర్శకుడి తదుపరి సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ నేపథ్యంలో మూడేళ్ళ గ్యాప్ తీసుకొని చేసిన 'మహాసముద్రం' సినిమా పరాజయం పాలైంది.

భారీ అంచనాల నడుమ గతేడాది దసరా పండగ సందర్భంగా విడుదలైన 'మహాసముద్రం' సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. స్టొరీ - స్క్రీన్ ప్లే ఏ దశలోనూ మెప్పించకపోయాయి. ఒకప్పుడు రొటీన్ సినిమాలు కోరుకునే వాళ్ళు తన 'ఆర్ఎక్స్ 100' చిత్రాన్ని చూడటానికి రావొద్దని చెప్పిన అజయ్ భూపతి.. రెండోసారి రొటీన్ సన్నివేశాలతో ఓ ప్లాప్ సినిమా ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

రెండో సినిమా ప్లాప్ అవడంతో చాలా మంది హీరోలు ఇప్పుడు అజయ్ తో కలిసి పని చేయడానికి సిద్ధంగా లేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దర్శకుడు మూడో సినిమా కోసం ఎక్కువగానే కష్టపడాల్సి ఉంటుందని అనుకుంటున్న నేపథ్యంలో.. అజయ్ కు ప్రముఖ ఓటీటీ నుంచి ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ సంస్థ అజయ్ భూపతితో ఓ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చిందట. ఇప్పటికే దర్శకుడు స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట. త్వరలో నటీనటుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని అంటున్నారు. ఓటీటీ అంటే కంటెంట్ విషయంలో ఇంకాస్త ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది. 'Rx 100' కు మించిన బోల్డ్ అండ్ వైలెంట్ కథను చెప్పడానికి ఆస్కారం కల్పిస్తుంది. అజయ్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చేది నిజమే అయితే.. ఈసారి ఎలాంటి కథతో వస్తారో చూడాలి.

ఇకపోతే అజయ్ భూపతి సైతం తదుపరి సినిమా కచ్చితంగా అందరిని మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 'మహాసముద్రం' ప్లాప్ తర్వాత ఓ నెటిజన్ కు సమాధానమిస్తూ.. ''మీ అంచనాలను అందుకోలేకపోయినందుకు క్షమించండి.. నెక్స్ట్ టైం మీ అందరినీ సంతృప్తి పరిచే కథతో తిరిగి వస్తాను'' అని దర్శకుడు ట్వీట్ చేశారు. ఏదేమైనా టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ ఈసారి బ్లాక్ బస్టర్ అందుకొని టాలీవుడ్ క్రేజీ ఫిలిం మేకర్ గా మారిపోవాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News