ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి స‌మ‌ర్పించు బాలీవుడ్ చిత్రం

Update: 2022-04-16 05:31 GMT
ఓడ‌లు బ‌ల్ల‌వుతాయి.. బ‌ల్లు ఓడ‌ల‌వుతాయంటారు.. ఇప్ప‌డు అదే జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ అంటే చిన్న చూపు చూసిన బాలీవుడ్ ఇప్ప‌డు మ‌న కోసం.. మ‌న సినిమాల కోసం.. మ‌న డైరెక్ట‌ర్ల కోసం వెంప‌ర్లాడుతుండ‌టం విశేషం. దీనికి ప్ర‌ధాన కార‌కుడు రాజ‌మౌళి. `బాహుబ‌లి` త‌రువాతే టాలీవుడ్ పై బాలీవుడ్ కు ప్రేమ మొద‌లైంది.

టాలీవుడ్ గురించి మాట్లాడాల్సి వ‌స్తే `బాహుబ‌లి` కి ముందు `బాహుబ‌లి`కి త‌రువాత అని చెప్పుకోవాల్సిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ భారీ మూవీ త‌రువాతే తెలుగు సినిమా స్థాయితో పాటు మార్కెట్ కూడా పెరిగింది. టాలీవుడ్ తో పాటు ద‌క్షిణాదిలో పాన్ ఇండియా చిత్రాల నిర్మాణానికి మేక‌ర్స్ ధైర్యంగా ముందుకొస్తున్నారంటే అది రాజ‌మౌళి ఇచ్చిన ధైర్య‌మే.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ తో పాన్ ఇండియా మూవీ `ప్రాజెక్ట్ కె`ని రూపొందిస్తున్న నాగ్ అశ్విన్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు కూడా. ఈ రోజు అంతా పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నామంటే అందుకు ప్ర‌ధాన కార‌ణం రాజ‌మౌళి, ప్ర‌భాస్ లు అని బాహాటంగానే వెల్ల‌డించి రాజ‌మౌళి తెలుగు సినిమా ద‌శ‌ని, దిశ‌ని మార్చాడ‌ని  చెప్పేశాడు. రాజ‌మౌళి వేసిన బాట‌లో కేజీఎఫ్‌, పుష్ప తో పాటు ఇప్పుడు కేజీఎఫ్ 2 కూడా పాన్ ఇండియా వైడ్ గా సంచల‌నాలు సృష్టిస్తుండ‌టం విశేషం.

కేజీఎఫ్ 2 రీసెంట్ గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధిస్తూ దేశ వ్యాప్తంగా వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఇక `బాహుబ‌లి` నుంచి రాజ‌మౌళిని కీర్తించ‌ని బాలీవుడ్ సెల‌బ్రిటీ లేరు. క‌ర‌ణ్‌ జోహార్ నుంచి అజ‌య్ దేవ‌గ‌న్, అమీర్ ఖాన్ వ‌ర‌కు ఇండియ‌న్ సినిమాకు స‌రికొత్త కీర్తిని ఆపాదిస్తున్న రాజ‌మౌళిని ప్ర‌శంసించారు. ఇక తాజాగా ట్రిపుల్ ఆర్ సాధిస్తున్న రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని గ‌మ‌నిస్తున్న క‌ర‌ణ్ జోహార్ టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

అంతే కాకుండా కోవిడ్ కార‌ణంగా కుదేలైన భార‌తీయ సినిమాకు మ‌రీ ముఖ్యంగా థియేట‌ర్ల‌కు ట్రిపుల్ ఆర్ లాంటి చిత్రాల‌తో జోష్ ని నింపార‌ని కొనియాడారు. ఈ చిత్రంతో రాజ‌మౌళి అందించిన ఉత్సాహంతో మేము కూడా ఇక రంగంలోకి దిగుతామ‌న్నారు.  ఈ ఏడాది ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్ పై భారీ చిత్రాల‌ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తామ‌న్నారు. ఇక్క‌డే అస‌లు క‌థ మొద‌లైంది. క‌ర‌ణ్ జోహార్ ప్ర‌స్తుతం ర‌ణ్ బీర్ క‌పూర్, అలియా భ‌ట్ ల‌తో `బ్ర‌హ్మాస్త్ర‌` చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. `బాహుబ‌లి` స్ఫూర్తితో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా హిందీ, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల కానుంది.

ఈ మూవీ 3డీ ఫార్మాట్ తో పాటు ఐమ్యాక్స్ వెర్ష‌న్ లోనూ విడుద‌ల కానుంది.  అయితే ఈ చిత్రానికి ద‌క్షిణాదిలోని నాలుగు భాష‌ల్లో ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. `బాహుబ‌లి` హిందీ వెర్ష‌న్ కు క‌ర‌ణ్‌ జోహార్ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తే ఇప్ప‌డు ఎస్. ఎస్‌. రాజ‌మౌళి బాలీవుడ్ సినిమాకు ప్ర‌జెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం గ‌మ‌నార్హం. ఈ మార్పుని గ‌మ‌నించిన వారంతా ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి స‌మ‌ర్పించు బాలీవుడ్ చిత్రం అంటూ గ‌ర్వంగా చెబుతున్నారు.
Tags:    

Similar News