మంత్రి రోజా భ‌ర్తకు స్టార్ హీరో బిగ్ షాక్‌?

Update: 2022-05-05 16:30 GMT
ఏపీ మంత్రి, న‌టి రోజా భ‌ర్త ఆర్‌.కె. సెల్వ‌మ‌ణికి త‌మిళ స్టార్ హీరో విజ‌య్ బిగ్ షాక్ ఇచ్చారా?. ఆయ‌న మాట‌ని లెక్క‌చేయ‌కుండా ఆశ్చ‌ర్య‌ప‌రిచారా? అంటే త‌మిళ వ‌ర్గాలు అవున‌నే చెబుతున్నాయి. వివ‌రాల్లోకి వెళితే... త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ఇటీవ‌ల 'బీస్ట్' చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ విడుద‌లైంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ చిత్రాల నిర్మాత క‌ళానిధి మార‌న్ ఈ మూవీని నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది.

సీమాంత‌ర తీవ్ర‌వాదం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ ఇటీవ‌లే విడుద‌లైంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయింది. విజ‌య్ గ‌త చిత్రాల‌తో పోలిస్తే ఈ మూవీ భారీ ప‌రాజ‌యాన్ని సొంతం చేసుకుంది. దీంతో అభిమానులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. చెన్నైలో ఏకంగా ఓ థీయేట‌ర్ కు నిప్పు పెట్ట‌డం సంచ‌ల‌నం సృష్టించింది. భారీ అంచ‌నాలు పెట్టుకున్న సినిమా దారుణంగా ఫ్లాప్ కావ‌డంతో హీరో విజ‌య్ తో పాటు ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ పై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

విజ‌య్ తండ్రి ఏకంగా ద‌ర్శ‌కుడిని టార్గెట్ చేస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య్ స్టార్ డ‌మ్ వ‌ల్ల ఆ మాత్రం క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. కంటెంట్ వుంది కానీ సినిమాలో స్క్రీన్ ప్లే ఏది అంటూ ఏకి పారేశాడు. ఇదిలా వుంటే హీరో విజ‌య్ తాజాగా మంత్రి రోజా భ‌ర్త ఆర్. కె. సెల్వ‌మ‌ణికి షాకిచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

ఆర్. కె. సెల్వ‌మ‌ణి ప్ర‌స్తుతం ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. స్టార్ హీరోలైన విజ‌య్, అజిత్ త‌మ సినిమాల షూటింగ్ లు చెన్నైలో చేయ‌కుండా హైద‌రాబాద్‌, వైజాగ్ వెళుతున్నార‌ని, అక్క‌డే అత్య‌ధిక భాగం షూటింగ్ చేస్తున్నార‌ని, ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌ని, దాని వ‌ల్ల త‌మిళ‌నాడుకు చెందిన సినీ కార్మికులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని, ఇక‌పై స్టార్ హీరోల షూటింగ్ లు చెన్నైలోనే జ‌ర‌గాల‌ని వెల్ల‌డించారు. అంతే కాకుండా ఈ విష‌యాన్ని అజిత్ కు వివ‌రిస్తే ఆయ‌న ఇందుకు అంగీక‌రించార‌న్నారు.

ఈ నేప‌థ్యంలో గురువారం హీరో విజ‌య్ న‌టిస్తున్న కొత్త చిత్రం హైద‌రాబాద్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావ‌డం ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి హీరో విజ‌య్ తో ఓ భారీ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది.

సెల్వ‌మ‌ణి ప్ర‌క‌ట‌న నేప‌థ్యంలో విజ‌య్ సినిమా హైద‌రాబాద్ లో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కావ‌డంతో సెల్వ‌మ‌ణి కి హీరో విజ‌య్ షాకిచ్చారా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఇది బైలింగ్వ‌ల్ మూవీ కాద‌ని, త‌మిళ సినిమా అని చెప్పిన విజ‌య్ ఈ మూవీ షూటింగ్ కోసం మాత్రం హైద‌రాబాద్ రావ‌డం సెల్వ మాట‌ల‌ని ప‌ట్టించుకోలేద‌నే వాద‌న వినిపిస్తోంది.
Tags:    

Similar News