హీరో అనే అహం ఆయ‌న‌లో చూడ‌లేదు!

Update: 2023-01-03 10:30 GMT
సంక్రాంతి బ‌రిలో పందెం పుంజులా దూసుకొస్తున్నాడు వీర‌సింహారెడ్డి. జనవరి 12న డేట్ లాక్ చేసి బాక్సాఫీస్ లు బ‌ద్ధ‌లు కొట్టేందుకు ప్రిప‌రేష‌న్ లో ఉన్నాడు ఎన్బీకే. అఖండ‌తో ఘ‌న‌విజ‌యం అందుకున్న ఉత్సాహంలో ఇప్పుడు 'వీరసింహారెడ్డి'గా మరో అసాధార‌ణ‌ విజ‌యాన్ని ఖాతాలో వేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌చారం లో కొత్త ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. మాస్ మొగుడు అనే కొత్త పాట విడుద‌ల కావాల్సి ఉండ‌గా ఇంత‌కుముందే షెడ్యూల్ ప్రకారం పాటను విడుదల చేయడం లేదని టీమ్ అప్ డేట్ ఇచ్చింది. బదులుగా వారు త్వరలో థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరిస్తారు. ప్రీ-రిలీజ్ ఈవెంట్ వివరాలను తెలియజేస్తారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో యూనిట్ ప్రమోషన్ స్ట్రాటజీని మార్చుకున్నారని టాక్ వినిపించింది.

భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీపై సినిమాటోగ్రాఫ‌ర్ రిషి పంజాబీ తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. "సెట్లో అంద‌రితో ఎంతో గౌరవంగా మర్యాదగా ఉండే స్టార్ బాల‌కృష్ణ‌. హీరో అనే అహం ఆయనలో ఏమాత్రం చూడ‌లేద"ని అన్నారు.

సాంకేతిక నిప‌పుణులంద‌రికీ ఎంతో గౌర‌వం ఇచ్చే స్టార్ ఆయ‌న అని కొనియాడారు. క్రియేటివిటీ ప‌రంగా చేసే పని విషయంలో ఎంతో స్వేచ్చనిస్తారని అందుకే ఆయనతో పని చేయడం ఎంతో తేలిక అని అన్నారు. వీర సింహారెడ్డి అభిమానుల అంచ‌నాల‌ను అందుకుంటుంద‌ని వ్యాఖ్యానించారు.

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత‌ భారీ బడ్జెట్‌తో నిర్మించిన‌ ఈ చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా నటించింది. క్రాక్ ఫేమ్ వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించారు. తమన్ స్వరాలు అందించారు.  రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ ఈ మూవీకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News