'గరుడ వేగ'కి సీక్వెల్ రావడం ఖాయమే!

Update: 2022-05-27 00:30 GMT
రాజశేఖర్ ఆ మధ్య  వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సమయంలో 'గరుడ వేగ' వచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. చాలా కాలం తరువాత మంచి లాభాలను తెచ్చిపెట్టిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో రాజశేఖర్ మంచి ఫిట్ నెస్ తో కనిపిస్తూ .. ఆయన ఎప్పుడూ యాంగ్రీ యంగ్ మేనే అనుకునేలా చేశారు. ఈ సినిమా హిట్ ఇచ్చిన ఎనర్జీతో  రాజశేఖర్ మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లారు. అయితే ఇంతవరకూ ఆయనకి ఆ స్థాయి హిట్ పడలేదు.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "వెంట వెంటనే  పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేస్తే  ఆడియన్స్ బోర్  ఫీలవుతారని నేను అనుకోను. ఎందుకంటే కథలో .. పాత్రలో కొత్తదనం ఉంటే ఆడియన్స్ అలా అనుకోరు.

అందువల్లనే నేను పోలీస్ ఆఫీసర్ గా చేసిన పాత్రలను ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పటికీ పోలీస్ డిపార్టుమెంటువారు నన్ను తమలో ఒకడిగా భావించే మాట్లాడుతూ ఉంటారు. ఏ సినిమా  చేస్తున్నా కథనే హీరోగా భావిస్తూ ఉంటాను.  ఇంతకాలం పాటు నేను ఇండస్ట్రీలో ఉండటానికి కారణం ఇదే.  

ఇక చాలామంది 'కొరటాల - ఎన్టీఆర్ సినిమాలో విలన్ గా చేస్తున్నారట గదా?' అని అడుగుతున్నారు. అలా అనుకోవడం నాకు తెలిసి ఇక వాళ్లు వచ్చి నన్ను అడుగుతారేమోనని అనుకుంటూ ఉంటాను. గతంలో అలా ఎదురుచూసిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ఇంతవరకూ ఆ సినిమా నుంచి నన్ను ఎవరూ సంప్రదించలేదు. కొరటాలతో కలిసి నాకూ పనిచేయాలనే ఉంది. ఆయన అడిగితే .. నా పాత్ర నచ్చితే తప్పకుండా చేస్తాను. గతంలో మణిరత్నం సినిమాలో ఛాన్స్ వస్తే చేయలేకపోయాను. 'దళపతి'లో అరవింద్ స్వామి చేసిన  పాత్ర నేను చేయవలసింది.

ఇక శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది. భవిష్యత్తులో మా కాంబినేషన్లో ఒక సినిమా తప్పకుండా ఉంటుంది. ఇంతవరకూ నేను నా సినిమాల్లో దేనికీ సీక్వెల్ చేయలేదు. కానీ 'గరుడ వేగ' సినిమాకి సీక్వెల్ చేయబోతున్నాం. ఈ ఏడాది చివరిలో ఈ సినిమా సీక్వెల్ సెట్స్ పైకి వెళుతుంది. ఆ లోగా మరో సినిమా చేయబోతున్నాను. ఈ ప్రాజెక్టు  జూన్  2వ వారం నుంచి సెట్స్ పైకి వెళుతుంది. అందుకు సంబంధించిన విషయాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తాము" అని చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News