RRR బాలీవుడ్ సినిమా అనుకుంటున్నారా?

Update: 2023-01-14 12:30 GMT
రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన 'RRR' ప్ర‌పంచ వ్యాప్తంగా విశేష ఆద‌ర‌ణ‌ని సొంతం చేసుకుంది. అదే స్థాయిలో విదేశీ ప్రేక్ష‌కుల‌తో పాటు హాలీవుడ్ ప్ర‌ముఖుల నుంచి కూడా ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటూ ప‌లు అంత‌ర్జాతీయ వేడుక‌ల్లో బ్యాక్ టు బ్యాక్‌ పుర‌స్కారాల్ని ద‌క్కించుకుంటూ ఆస్కార్ దిశ‌గా దూసుకుపోతోంది. రీసెంట్ గా హాలీవుడ్ స్టార్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే గోల్డోన్ గ్లోబ్ అవార్డుల్లో 'నాటు నాటు' బెస్ట్ ఒరిజిన‌ల్ సాంగ్‌ విభాగంలో అవార్డుని సొంతం చేసుకుని చ‌రిత్ర సృష్టించింది.

ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన రెండ‌వ సినిమాగా 'RRR' చ‌రిత్ర సృష్టించింది. మొదట ఈ అవార్డుని ఏ ఆర్‌. రెహ‌మాన్ 'స్ల‌మ్ డాగ్ మిలియ‌నీర్‌' సినిమాకు గానూ 'జై హో' సాంగ్ కు గానూ తొలిసారి గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని సొంతం చేసుకోగా ఆ ఫీట్ ని సాధించిన రెండ‌వ సినిమాగా 'RRR' నిలిచింది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందంపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఇండియా వ్యాప్తంగా ప్ర‌ముఖులు, స్టార్స్‌, పొలిటిక‌ల్ లీడ‌ర్స్ RRR టీమ్ ని అభినందిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

అంతే కాకుండా ప్ర‌పంచ న‌లుమూల‌ల నుంచి ప్ర‌ముఖులు, స్టార్స్ 'RRR'పై ప్ర‌శంస‌ల్లో ముంచెత్తుతున్నారు. ఇదిలా వుంటే రీసెంట్ గా గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారాన్ని ద‌క్కించుకున్న 'RRR' మూవీ బాలీవుడ్ సినిమా అని అనుకుంటున్నార‌ట అక్క‌డి వారు. దీనిపై తాజాగా రాజ‌మౌళి స్పందించారు. 'నాటు నాటు పాట‌కు గానూ 'RRR' ప్ర‌తిష్టాత్మ‌క గోల్డెన్ గ్లోబ్ అవార్డు ద‌క్కిన నేప‌థ్యంలో ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి అమెరికా డైరెక్ట‌ర్స్ గిల్డ్ లో పాల్గొని కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

'RRR' బాలీవుడ్ సినిమా కాదు. ఇది సౌత్ ఇండియాకు సంబంధించిన తెలుగు సినిమా అన్నారు. అంతే కాకుండా తాను అక్క‌డి నుంచే వ‌చ్చాన‌ని, స్టోరీని ముందుకు తీసుకెళ్ల‌డానికి 'నాటు నాటు' పాట‌ను ఉప‌యోగించుకున్నాన‌న్నారు. సినిమా ముగిశాక 3 గంట‌ల్లా అనిపించలేద‌ని ప్రేక్ష‌కుడు చెబితే తాను ద‌ర్శ‌కుడిగా స‌క్సెస్ అయిన‌ట్టేన‌ని భావిస్తాన‌న్నారు. జ‌క్క‌న్న చెప్పిన స‌మాధానం ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తోంది.

'RRR' త‌రువాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో పాన్ వ‌ర‌ల్డ్ మూవీని తెర‌పైకి తీసుకురాబోతున్న విష‌యం తెలిసిందే. ఆఫ్రికా ఫారెస్ట్ నేప‌థ్యంలో తెర‌పైకి రానున్న ఈ మూవీని అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రాజ‌మౌళి తెర‌పైకి తీసుకురాబోతున్నారు. ఇందుకు సంబంధించిన వ‌ర్క్ ని ఇప్ప‌టికే మొద‌లు పెట్టిన జ‌క్క‌న్న ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ని మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. దుర్గా ఆర్ట్స్ అధినేత కె.ఎల్‌. నారాయ‌ణ ఈ భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీని నిర్మించ‌బోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News