ట్రెండ్ అవుతున్న వ‌రుణ్ తేజ్ ఎమోష‌న‌ల్ లెట‌ర్

Update: 2022-04-12 11:30 GMT
మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ న‌టించిన లేటెస్ట్ బాక్సింగ్ డ్రామా 'గ‌ని' రీసెంట్ గా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ మూవీ ద్వారా సాయి కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో అల్లు బాబి, సిద్దూ ముద్ద సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేక‌ర్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో క‌న్న‌డ స్టార్  ఉపేంద్ర‌, బాలీవుడ్ సీనియ‌ర్ హీరో సునీల్ శెట్టి కీల‌క పాత్ర‌లో న‌టించారు.

గ‌త శుక్ర‌వార‌మే ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్లో విడుద‌లైంది. బాక్సింగ్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీలో వ‌రున్ తేజ్ బాక్స‌ర్ గా న‌టించారు. ఈ పాత్ర కోసం వ‌రుణ్ చాలా శ్ర‌మించారు. భారీ స్థాయిలో వ‌ర్క‌వుట్ లు చేయ‌డ‌మే కాకుండా ప్ర‌త్యేకంగా యుఎస్ లో బాక్సింగ్ శిక్ష‌ణ కూడా తీసుకున్నారు. పూర్తి ప‌ర్ ఫెక్ష‌న్ వ‌చ్చిన త‌రువాతే సెట్ లోకి అడుగుపెట్టారు. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్పాడ్డాయి. అయితే ఆ అంచ‌నాల్ని ఈ మూవీ ఏ మాత్రం చేరుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద నిరాశ ప‌రిచ‌యింది.

వ‌రుణ్ త‌న పాత్ర ప‌ర్‌ఫెక్ష‌న్ కోసం చ‌మ‌ట చిందించినా సినిమాని కాపాడ‌లేక‌పోయింది. దీంతో ఆయ‌న శ్ర‌మంతా వృధా అయిపోయింది. దాదాపు 30 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించార‌ని చెబుతున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం ఇప్ప‌టి వ‌ర‌కు 4 కోట్ల షేర్ ని మాత్ర‌మే రాబ‌ట్ట‌డంతో హీరో వ‌రున్ తేజ్ తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌యిన‌ట్టుగా తెలుస్తోంది. భారీ హోప్స్ పెట్టుకుని చేసిన సినిమా పేల‌వ‌మైన ఫ‌లితాన్ని అందించ‌డంతో తీవ్ర భావోద్వేగానికి లోనైన వ‌రుణ్ తేజ్ మంగ‌ళ‌వారం అభిమానుల కోసం ఓ ఎమోష‌న‌ల్ లెట‌ర్ ని విడుద‌ల చేశారు.

'గ‌త కొన్నేళ్లుగా నాపై మీరు చూపిస్తున్న ప్రేమ‌కు, అభిమానానికి చాలా కృత‌జ్ఞ‌డిని. 'గ‌ని' మూవీ నిర్మాణంలో పాలు పంచుకున్న ప్ర‌తీ ఒక్క‌రికీ నా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. ప్ర‌తీ ఒక్క‌రు ఈ సినిమా కోసం చాలా హ‌ర్డ్ వ‌ర్క్ చేశారు.

అంతే కాకుండా ఈ మూవీ నిర్మాణం కోసం ప్రాణం పెట్టారు. ఈ విష‌యంలో ప్ర‌తీ ఒక్క‌రికీ.. నిర్మాత‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. మంచి చిత్రాన్ని మీకు అందించాల‌ని అంతా ప్యాష‌న్ తో శ్ర‌మించాం కానీ మా ఐడియా అనుకున్న విధంగా తెర‌పైకి రాలేక‌పోయింది.

ప్ర‌తీ సినిమాకు ప్రాణం పెట్టి వ‌ర్క్ చేస్దాం. ప్ర‌ధానంగా మిమ్మ‌ల్ని ఎంట‌ర్ టైన్ చేయాల‌ని అనుకుంటాం. కొన్ని సార్లు స‌క్సెస్ అవుతాం.. కొన్ని సార్లు పాఠాలు నేర్చుకుంటాం. అయినా హార్డ్ వ‌ర్క్ చేయ‌డం మాత్రం ఆప‌ను. అంద‌రికి ధ‌న్య‌వాదాలు' అంటూ త‌న ఎమోష‌న‌ల్ లెట‌ర్ ని ముగించారు వ‌రుణ్ తేజ్‌. ప్ర‌స్తుతం ఈ లెట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది.
Tags:    

Similar News