ముంబైలో మకాం వేసిన ఇద్దరు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్..!

Update: 2022-11-09 08:30 GMT
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో పూరీ జగన్నాథ్ మరియు హరీష్ శంకర్ స్పెషల్ గా చెప్పుకోవాలి. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో.. హీరోలతో పంచ్ డైలాగ్స్ పలికించడంలో వీరిద్దరికీ ప్రత్యేకమైన శైలి ఉంది. అందుకే తమ ఫేవరేట్ హీరోలు ఈ దర్శకులతో ఒక్కసారైనా పని చేయాలని అభిమానులు కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరికీ ఆశించిన విధంగా ఏదీ కలిసి రావడం లేదనిపిస్తోంది.

'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో హిట్టు కొట్టి మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చాడనిపించిన డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.. ఇటీవల 'లైగర్' చిత్రంతో భారీ డిజాస్టర్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండా హీరోగా దాదాపు మూడేళ్లు కష్టపడి చేసినా ఈ సినిమా ఏ దశలనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో అగ్ర దర్శకుడి చుట్టూ ఒక్కసారిగా నెగెటివిటీ వచ్చి చేరింది.

తన కెరీర్ లో బిగ్గెస్ట్ ప్లాప్ వచ్చినా పూరీ ఏమాత్రం డీలా పడలేదు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే తిరిగి రాబట్టుకోవాలనుకుంటూ బాలీవుడ్ లోనే మళ్ళీ సినిమా చేయాలనే ఆసక్తితో ఉన్నాడు. దీని కోసం ముంబైలోనే మకాం వేసిన దర్శకుడు.. ఈసారి తన సత్తా ఏంటో చూపించడానికి స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ ను కలుస్తున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా తలపెట్టిన 'JGM' వంటి భారీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిన తర్వాత.. పూరీ జగన్నాథ్ ఇప్పుడు ఇప్పుడు బాలీవుడ్ యంగ్ హీరోలతో వర్క్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా నెక్స్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని పూరీ గట్టిగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హరీష్ శంకర్.. 'గద్దలకొండ గణేష్' తర్వాత మరో సినిమా చేయలేదు. మూడేళ్లు గడుస్తున్నా ఇంతవరకూ తదుపరి ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకురాలేకపోయాడు. నిజానికి పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా చేయాల్సింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రెండేళ్ల క్రితమే అనౌన్స్ మెంట్ వచ్చింది.

'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శక హీరోల కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే పాండమిక్ మరియు జనసేన అధినేత ఇతర ప్రాధాన్యతల వల్ల ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత కూడా పవన్ మిగతా దర్శకులతో రెండు సినిమాలు చేసారు కానీ.. హరీష్ శంకర్ కు మాత్రం డేట్స్ ఇవ్వలేదు. రాజకీయాల్లో బిజీగా ఉండటంతో అసలు డేట్స్ ఇస్తాడనే విషయంలో క్లారిటీ లేదు.

భవదీయుడు ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు హరీష్ బాలీవుడ్ లో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లిన డైరెక్టర్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌ తో చర్చలు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. మైత్రీ టీమ్ ఇదివరకే సల్మాన్ కు అడ్వాన్స్ రూపంలో భారీ మొత్తాన్ని చెల్లించినట్లు టాక్.

ఈ నేపథ్యంలో కండల వీరుడితో హరీష్ శంకర్ కు ఒక మీటింగ్ ఏర్పాటు చేసారట. సల్మాన్ ఖాన్ ఓకే చెప్పి, హరీష్ ఫైనల్ స్క్రిప్ట్‌ ను లాక్ చేస్తే.. వెంటనే ఈ చిత్రం ట్రాక్‌ లోకి వస్తుందని అంటున్నారు. ఇది సెట్ అయితే డైరెక్టర్ కు ఫస్ట్ బాలీవుడ్ మూవీ అవుతుంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై స్పష్టత వస్తుందేమో చూడాలి. ఇలా పూరీ జగన్నాథ్ మరియు హరీష్ శంకర్ ఇద్దరూ ముంబైలో మకాం వేసి బాలీవుడ్ ప్రయత్నాలు చేస్తున్నారు. మరి టాలీవుడ్ అగ్ర దర్శకులకు అక్కడైనా పని అవుద్దేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News