పిల్లల్ని కనడంపై సద్గురును ప్రశ్నించిన మెగా కోడలు ఉపాసన..!

Update: 2022-07-04 09:34 GMT
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవలే ఇటలీలో తమ పదో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నారు. గత పదేళ్లుగా ఎంతో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్న చెర్రీ-ఉపాసన.. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లో ఒకరిగా నిలిచారు. కుటుంబం పట్ల మాత్రమే కాదు.. ఈ సమాజం పట్ల కూడా ఇద్దరూ చాలా బాధ్యతగా వ్యవహరిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే ఈ మెగా జంటకు పిల్లలకు సంబంధించిన ప్రశ్న తరచుగా ఎదురవుతూ వస్తోంది.

పిల్లలు - ప్రెగ్నెన్సీ అనేది మా వ్యక్తిగత విషయమని గతంలో ఉపాసన ఓ సందర్భంలో చెప్పింది. ఇద్దరికీ ఆ విషయంలో ఒక ప్లాన్ ఉందని.. పిల్లల విషయపై ఒక క్లారిటీ ఉందిని తెలిపింది. పర్సనల్ అని చెప్పినప్పటికీ.. పలువురు అభిమానులు - నెటిజన్లు మాత్రం ఇదే విషయం గురించి పదే పదే మెగా కపుల్ ను ప్రశ్నిస్తూ వస్తున్నారు. గతంలో ఇదే విషయం మీద చిరంజీవి స్పందిస్తూ తాను, సురేఖ కూడా ఆ తరుణం కోసమే ఎదురుచూస్తున్నామని తెలిపారు. అయితే తాజాగా పిల్లల కనే విషయం మీద మాట్లాడి హాట్ టాపిక్ గా నిలిచారు.

లేటెస్ట్ గా సద్గురు జగ్గీవాస్ దేవ్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన.. తాను పిల్లల్ని కనడంపై కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగింది. ''నేను వివాహ బంధంలో అడుగుపెట్టి పదేళ్లు అవుతోంది. నా జీవితం చాలా చాలా చాలా హ్యాపీగా సాగుతోంది. నేను నా కుటుంబాన్ని నా జీవితాన్ని చాలా ప్రేమిస్తున్నాను. కానీ కొందరు నా లైఫ్ లో RRR గురించే ఎందుకు ఎక్కువ చర్చించుకుంటున్నారు. R అంటే రిలేషన్, R రీ ప్రొడ్యూస్ (పిల్లలు కనగలిగే సామర్థ్యం) - R రోల్ ఇన్ లైఫ్'' అని సద్గురును ఉపాసన ప్రశ్నించింది.

దీనికి సద్గురు స్పందిస్తూ.. ''రిలేషన్ షిప్ అది నీ పర్సనల్. దాని గురించి నేను మాట్లాడను. ఇక రీప్రొడ్యూస్ విషయానికి వస్తే ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను గతంలో అవార్డ్ కూడా ప్రకటించాను.

ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా పెరిగిపోతోంది. బ్రెయిన్ కంటే రీప్రొడ్యూస్ ఆర్గాన్స్ ఎక్కువ యాక్టీవ్ గా ఉంటే.. ఒకరి పాదాలపై మరొకరు పాదాలుంచేంత పరిస్థితి వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఆడ పులి అయ్యుంటే.. మీ జాతి అంతరించిపోతోంది పిల్లల్ని కనండి అని చెప్పేవాడిని'' అని సమాధానమిచ్చారు.

దీనికి ఉపాసన స్పందిస్తూ.. "నేను త్వరలోనే మా అమ్మ మరియు అత్తలతో మిమ్మల్ని మాట్లాడేలా చేస్తాను" అని నవ్వుతూ చెప్పింది. దానికి "నేను చాలా మంది అత్తలతో మాట్లాడాను" అని సద్గురు నవ్వుతూ చమత్కరించారు. పిల్లల గురించి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో.. ఉపాసన అదే విషయాన్ని ఒక వేదికపై ప్రస్తావించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. పిల్లల్ని కనే విషయంలో మెగా కోడలు క్లారిటీగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Full View

Tags:    

Similar News