మాజీ మిస్సు విశ్వ‌ ప్ర‌య‌త్నం ఫ‌లించేదెప్పుడు?

Update: 2022-07-21 02:30 GMT
మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ ఇటీవల విడుదలైన 'సామ్రాట్ పృథ్వీరాజ్' చిత్రంలో అక్షయ్ కుమార్ స‌ర‌స‌న‌ తన చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది. మాజీ మిస్సు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుంది కానీ సామ్రాట్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ వద్ద అంచనాలను అందుకోలేక‌పోయాడు. కేవ‌లం త‌న డెబ్యూ సినిమా రిలీజ్ కోసం ఐదేళ్లు వేచి చూసిన ఏకైక దుర‌దృష్ట నాయిక‌గా మానుషి పేరు నిలిచిపోయింది. రెండేళ్ల పాటు క‌రోనా క్రైసిస్ త‌న ఆరంగేట్ర‌ సినిమాకి ఆటంకంగా నిలిచింది. ఆ త‌ర్వాత మ‌రో రెండు చిత్రాల‌కు ఈ బ్యూటీ క‌మిటైనా వాటి వివ‌రాలు వెల్ల‌డి కాలేదు.

ఎట్ట‌కేల‌కు ఇప్పుడు మానుషి త‌దుప‌రి సినిమా లాంచ్ అయ్యింది. సింహ‌బ‌లుడు జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో తెర‌కెక్కుతున్న 'టెహ్రాన్' లో మానుషి క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. చిత్ర బృందం అందుకు సంబంధించిన ఫోటోల‌ను విడుదల చేసింది. ఇందులో మానుషి పొట్టి కేశాలంకరణతో ట్రెండీగా అందంగా కనిపిస్తోంది. జాన్ - మానుషి ఇద్ద‌రూ వెప‌న్స్ చేత‌ప‌ట్టి క‌నిపిస్తున్నారు కాబ‌ట్టి ఇది ఏదైనా స్పై ఆప‌రేష‌న్ లేదా ఆర్మీ- ఇంటెలిజెన్స్ నేప‌థ్యంలోని  సినిమా అని అర్థం చేసుకోవ‌చ్చు.

ఎ మాడాక్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ - బేక్ మై కేక్ ఫిల్మ్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇది నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం. అరుణ్ గోపాలన్  రితేష్ షా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆశిష్ ప్రకాష్ వర్మ స్క్రిప్టును అందించారు. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది.

హ‌ర్యానా బ్యూటీ దుర‌దృష్టం!

2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మానుషి చిల్ల‌ర్ ఆ త‌ర్వాత బాలీవుడ్ లో క‌థానాయిక‌గా రాణించాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. ఆ దిశ‌గా ప్ర‌య‌త్నాల్ని ముమ్మ‌రం  చేసినా ఆల‌స్యంగా అవ‌కాశాలొచ్చాయి. ఇటీవ‌ల క‌రోనా క్రైసిస్ వ‌ల్ల సెట్స్ పై ఉన్న సినిమాలు రిలీజ్ కి రాక‌పోవ‌డం త‌న దుర‌దృష్టం. తాను న‌టించిన తొలి సినిమా పృథ్వీరాజ్ రిలీజ్ కి రావ‌డానికే ఐదేళ్లు ప‌ట్టింది.

ఇది ఏ ఇత‌ర విశ్వ‌సుంద‌రికి రాని ప‌రిస్థితి. నిజానికి అందాల పోటీల్లో గెలిచిన చాలా మంది భామ‌లు చాలా సులువుగా అవ‌కాశాలు అందుకున్నారు. వేగంగా స్టార్లుగా ఎదిగేశారు. ఐశ్వ‌ర్యారాయ్- సుశ్మిత సేన్- లారా ద‌త్తా లాంటి భామ‌లు టాప్ స్టార్లుగా ఏలారు. కానీ మానుషికి అలాంటి అవ‌కాశం రానే లేదు.

24 ఏళ్ల మానుషి హర్యానాలో జన్మించిన టాప్ మోడల్ కం న‌టి. మిస్ వ‌ర‌ల్డ్ గా కిరీటం అందుకున్నాక‌  పృథ్వీరాజ్- ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వంటి చిత్రాలతో పాటు అజయ్ దేవగన్ తో ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని  చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇప్పుడు జాన్ తో సినిమా ప్రారంభ‌మైంది. ఇక పెర్ఫామెన్స్ ప‌రంగా మెప్పిస్తే కొన్నాళ్ల పాటు మానుషికి కెరీర్ ప‌రంగా ఏ ఢోఖా ఉండ‌ద‌ని భావించ‌వ‌చ్చు. త‌న తొలి సినిమా కోసం ఐదేళ్లు ఎంతో ఓపిగ్గా వేచి చూసింది. ఇక‌నైనా త‌న ఫేజ్ మారుతుంద‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News