సాయి ప‌ల్ల‌విపై విజ‌య‌శాంతి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు

Update: 2022-06-17 07:30 GMT
హీరోయిన్ సాయి ప‌ల్ల‌విపై న‌టి, బీజేపీ నేత విజ‌య‌శాంతి ఫైర్ అయ్యారు. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో సాయి ప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఘాటుగా స్పందించారు. వివ‌రాల్లోకి వెళితే.. రానా, సాయి ప‌ల్ల‌వి జంట‌ట‌గా న‌టించిన చిత్రం 'విరాట‌ప‌ర్వం'. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎల్ ఎల్ వి సినిమాస్ బ్యాన‌ర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. గ‌త ఏడాది కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ మూవీ ఎట్ట‌కేల‌కు ఈ శుక్ర‌వారం జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

1990 వ ద‌శ‌కంలో ఉత్త‌ర తెలంగాణ లో జ‌రిగిన ఓ య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఈ మూవీని తెర‌కెక్కించారు. న‌క్స‌లిజాన్ని చూపిస్తూనే ఓ అంద‌మైన ప్రేమ‌క‌థ‌ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఈ మూవీ రిలీజ్ సంద‌ర్భంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ప్ర‌త్యేకంగా ఇంటర్వ్యూ లు ఇచ్చింది.

త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌తో పాటు క‌శ్మీరి పండిట్ల హ‌త్య‌ల‌పై.. గో హ‌త్య‌ల పేరుతో వాటిని త‌ల‌ర‌లిస్తున్న వారిని కొట్టి జై శ్రీ‌రామ్ అంటూ నినాదాలు చేస్తున్న వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది. దీంతో సాయి ప‌ల్ల‌విపై భ‌జ‌రంగ్ ద‌ళ్ కు సంబంధించిన వ్య‌క్తులు పోలీసుల‌కు, సెన్సార్ బోర్డుకు కంప్లైంట్ చేశారు.

దీంతో వివాదం తారా స్థాయికి చేరింది. తాజాగా ఈ వివాదంపై, సాయి ప‌ల్ల‌వి చేసిన వ్యాఖ్య‌ల‌పై న‌టి, బీజేపీ నేత విజ‌య‌శాంతి ఘాటుగా స్పందించారు. 'కశ్మీర్ పండిట్లపై దారుణ అకృత్యాలకు పాల్పడిన వారిని.... గోవధ కోసం ఆవుల అక్రమరవాణాకు పాల్పడేవారిని అడ్డుకున్న గోసంరక్షకులను ఒకే గాటన కడుతూ హీరోయిన్ సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారి తీశాయి. మతోన్మాదంతో పండిట్లపై మారణకాండ సృష్టించడం...

ధర్మం కోసం దైవసమానమైన గోవులను కాపాడుకునేందుకు గోరక్షకులు చేసే పోరాటం ఒకటే ఎలా అవుతాయో కాస్త ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది. డబ్బు కోసం దోపిడీ దొంగ ఎవరినైనా కొట్టడం.... తప్పు చేసిన పిల్లవాడిని తల్లి దండించడం ఏవిధంగా ఒకటవుతాయి? ఆ దోపిడి దొంగను, తల్లిని ఒకేలా చూస్తారా? ఎవరైనప్పటికీ తమకు అవగాహన లేని విషయాల ప్రస్తావన వచ్చినప్పుడు సున్నితంగా ఆ అంశాన్ని పక్కన పెట్టడం మంచిది.నేడు మనం మాట్లాడే ప్రతి మాటా క్షణాల్లో కోట్లాదిమందికి చేరిపోతూ.... ఆ మాటల్లో ఏ మాత్రం తేడా ఉన్నా పట్టుకుని ప్రశ్నించే సమాజంలో ఉన్నాం.

అందువల్ల మాట్లాడే అంశాలపై సమగ్ర అవగాహనతో... సామాజిక స్పృహతో స్పందించడం చాలా అవసరమని గ్రహించాలి. ఏది ఏమైనా ఆ సినిమా ఆర్ధిక లాభాలతో ఆసక్తి ఉన్న నిర్మాణ సంబంధితులు, కశ్మీర్ ఫైల్స్ పోలిక తెచ్చి, ప్రజల దృష్టిని ఆకట్టుకోవడానికి చేసిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో ఆ కథానాయికను సమస్యల్లోకి లాగినట్టుందేమో అని కొందరు అభిప్రాయపడుతున్నట్టు సమాచారం కూడా అందుతోంది' అంటూ సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించింది.
Tags:    

Similar News