బ్రహ్మానందం గురించి తెలిసీ తెలియ‌నివి..!

Update: 2022-02-03 23:30 GMT
ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా బ్ర‌హ్మానందం గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. హాస్య బ్ర‌హ్మీగా అంద‌రి మ‌నసుల్లో నిలిచి ఉన్నారాయ‌న‌. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు.. ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం.. ఆరు సినీ మా అవార్డులు.. మూడు సైమా పురస్కారాలు అందుకున్నారు. 2005 లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి1న గుంటూరు  జిల్లా,.. సత్తెనపల్లి తాలూకా ముప్పాళ్ల మండలం... ముప్పాళ్ళ గ్రామంలో జన్మించారు. తండ్రి శ్రీ కన్నెగంటి నాగలింగాచారి.. తల్లి శ్రీమతి కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. తను పుట్టగానే తల్లికి గుర్రపువాతం వచ్చి అందరి దృష్టిలో అపరాధిలా నిలిచాడు. అప్పటికే ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి.. ఇతని ప్రసవంతో చనిపోతుందని భావించారు. కానీ అదృష్టవశాత్తు ఆమె ప్రాణాలు నిలిచాయి.

సత్తెనపల్లి శరభయ్య హైస్కూలులో విద్యార్థిగా చేరి పాఠాలు నేర్చాడు. తండ్రి కన్నెగంటి నాగలింగాచారి సన్నిహితులైన సున్నం ఆంజనేయులు ప్రోద్బలంతో భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో ఇంటర్మీడియట్- డిగ్రీ పూర్తి చేసాడు. గుంటూరు పీజీ సెంటర్లో తెలుగు సాహిత్యంలో ఎమ్మే పట్టా పుచ్చుకొన్నాడు. బ్రహ్మానందం అత్తిలిలో తొమ్మిది సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేశాక సినీరంగంలోకి అడుగుపెట్టారు.

ఇప్పట్లోలా ఇలా వెళ్లి అలా సినిమాలు చూసే అవకాశం ఆయనకు ఉండేది కాదు. ఉమ్మడి కుటుంబంలో మధ్యతరగతి జీవితాన్ని సాగిస్తున్న ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలతో పాటూ జనాభా కూడా ఎక్కువే! అమ్మ అప్పుడప్పుడూ ఇరుగు పొరుగుల్ని అనుకరిస్తూ మాట్లాడే హాస్యోక్తులే తనకు వినోదం! తండ్రి రంగస్థల నటుడే అయినా సీరియస్ ప్రొఫెషనేమీ కాదు. తల్లిదండ్రులకున్న కొద్దో గొప్పో కళాభిరుచి తనకీ అబ్బిందేమోనని బ్రహ్మానందం భావిస్తాడు. బాల్యంలో మారాం చేయకుండా బడికి బుద్ధిగానే వెళ్ళినా, ఎస్.ఎస్.ఎల్.సి.లో గట్టిగానే పాసైనా, చిన్న తప్పులు చేసినా, తండ్రి నుంచి బుద్ధితక్కువ వాడంటూ చివాట్లు తప్పేవి కావు. అయితే తెలివితక్కువ వాడని మాత్రం ఆయన ఎన్నడూ అనలేదంటాడు. చదువుతున్నప్పుడే స్వర అనుకరణలు (మిమిక్రీ) చేయడం, సాంస్కృతిక బృందాలలో (కల్చరల్ ఆర్గనైజషన్) చురుకుగా పాల్గొనడం ఈయనకు అలవడింది.

అత్తిలిలో ఉపన్యాసకుడుగా ఉంటూనే పలు నిజజీవితంలోని వ్యక్తులను అనుకరుణ చేస్తూ అందరి ప్రశంసలూ పొందిన బ్రహ్మానందం 1985లో దూరదర్శన్లో వచ్చిన `పకపకలు` కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించగా... మంచి స్పందన వచ్చింది. దూరదర్శన్ తప్ప.. ఇతర ఛానెళ్ళేవీ లేని ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అందరూ బ్రహ్మానందాన్ని ఇట్టే గుర్తు పట్టేవారు.

బ్రహ్మానందాన్ని మొట్టమొదటి సారిగా మూవీ కెమెరా ముందు మేకప్ వేసి నిలబెట్టినవ్యక్తి దర్శకుడు వేజళ్ల సత్యనారాయణ. నరేశ్ కథానాయకుడిగా నటించిన శ్రీ తాతావతారం అనే చిత్రంలో కథానాయకుడి నలుగురు స్నేహితులలో ఒకడిగా నటించాడు. విశేషం ఏమిటంటే తన పుట్టినరోజు ఫిబ్రవరి 1 వ తేదీన ఆ సినిమాలో తొలి వేషం వేశాడు. 1985లో హైదరాబాద్ వెస్లీ కాలేజీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు హీరో నరేశ్‌తో తీసిన తొలి షాట్ బ్రహ్మానందం నటజీవితానికి శ్రీకారం చుట్టింది. ఈ చిత్రంతో నటించడం ప్రారంభించినా.. తొలిసారి విడుదలయిన చిత్రం మాత్రం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అహ! నా పెళ్ళంట!.

పేరు తెచ్చిన పాత్ర సవరించు ..పాడె మీద పైసలు ఏరుకొనే వెధవా... పోతావ్ రా రేయ్... నాశనమై పోతావ్... అంటూ యజమాని పీనాసితనాన్ని బాహాటంగా కక్కలేక తనలోనే అగ్గిబుగ్గైపోతూ ఆక్రోశాన్ని దిగమింగుకొనే అహ! నా పెళ్ళంట ! లోని అరగుండు పాత్రతో తెలుగు ప్రేక్షకుల దృష్టి అతనిపై పడింది. ``అరగుండు వెధవా`` అని కోటతో తిట్టించుకొన్న ఆ అరగుండు పాత్రే బ్రహ్మానందం.. తన హాస్యనట విశ్వరూపాన్ని ప్రదర్శించేలా చేసింది. జంధ్యాల తను దర్శకత్వం వహిస్తున్న `చంటబ్బాయ్` సినిమా నిర్మాణ సమయంలో చిరంజీవికి పరిచయం చేయడం తర్వాత ``పసివాడి ప్రాణం``లో ఓ చిన్న పాత్ర వేయడం. ఇలా నలుగుతున్న రోజుల్లో ఆయన ఇచ్చిన అవకాశం అహ నా పెళ్ళంటలో అరగుండు పాత్ర. ఈ పాత్రతో బ్రహ్మానందం నటజీవితాన్ని మలుపు తిప్పేలా చేసిన దర్శకుడు జంధ్యాలను.. అలాగే ఆ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ఆ చిత్ర నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు ను.. ఆ రోజుల్లో అన్ని విధాలా ప్రోత్సహించిన చిరంజీవిని ఎప్పటికీ మరువలేను అంటారు బ్ర‌హ్మీ. ఈ చిత్రంలో వేసిన పాత్ర ఆనాటి నుంచి బ్రహ్మానందం నట జీవితంలో యేడాదికి 35 చిత్రాలకు తగ్గకుండా నటించేందుకు పాదులు తీయడం గమనార్హం.

ప్రజాదరణ పొందిన ఊత పదాలు :

నీ యంకమ్మా (చిత్రం భళారే విచిత్రం చిత్త్రంలోని సంభాషణ)
పండగ చేసుకో (భిక్షగాడి పాత్ర ఆలీతో పోకిరి చిత్రంలో అర్థ రూపాయి దానం చేసి అనే సంభాషణ)
రకరకాలుగా ఉంది మాస్టారూ (నువ్వు నాకు నచ్చావ్ చిత్రం)
ఖాన్ తో గేమ్స్ ఆడకు... శాల్తీలు లేచిపోతాయి... (మనీ మనీ చిత్రం)
దొరికాడా ఏశెయ్యండి... (పట్టుకోండి చూద్దాం)
జఫ్ఫా (చాలా చిత్రాలలో)
ఇరుకుపాలెం వాళ్లంటే ఏకసెక్కాలుగా ఉందా? (ధర్మచక్రం)
నా పెర్ఫార్మెన్స్ మీకు నచినట్లైతే ఎస్సెమ్మెస్ చేయండి (దూకుడు)
నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు (ఢీ)

బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం.. సిద్ధార్థ్. ఒకరు ఎం. బి. ఏ మరొకరు బి. టెక్ పూర్తి చేశారు. గౌతమ్ కథానాయకుడిగా పల్లకిలో పెళ్ళికూతురు అనే చిత్రం వచ్చింది. బ్రహ్మానందం తండ్రికి శిల్పకళ తెలియడంతో ఆయనకు కూడా ఈ కళ కొద్దిగా అలవడింది. ఖాళీ సమయాల్లో బొమ్మలు కూడా గీస్తుంటాడు. తండ్రి నుంచే ఆయనకు పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. కోట్లాది ప్రేక్షకులను నవ్వించే బ్రహ్మానందం మనుమడు `పార్ధా` చేసే చిలిపి చేష్టలకు కడుపుబ్బ నవ్వేస్తుంటాడు.

అవార్డులు - సత్కారాలు:

నటుడిగా గుర్తింపు నిచ్చిన అహ నా పెళ్లంట చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. మనీ.. అనగనగా ఒక రోజు.. అన్న.. వినోదం చిత్రాలకు కూడా నంది పురస్కారాలను పొందారు.
దేశ‌విదేశాల్లో బ్ర‌హ్మీకి సన్మానాలు జ‌రిగాయి. ఆటా (అమెరికా)- సింగపూర్- మలేషియా- లండన్ డాకర్స్- అరబ్ ఎమిరేట్స్.., ఆస్ట్రేలియా దేశాల్లో తెలుగు అసోసియేషన్స్ వారి సత్కారాలు.., షోలాపూర్, ఢిల్లీ తెలుగు అకాడమీల నుంచి సన్మానాలు అందుకున్నారు. విజయవాడ విశ్వబ్రాహ్మణ సంఘం వారు స్వర్ణ గండపెండేరాన్ని తొడిగి సత్కరించారు.

పద్మమోహన సంస్థ బంగారు పతకాన్ని బహూకరించింది.
సత్తెనపల్లి ఫ్రెండ్స్ క్లబ్‌- జర్నలిస్టు అసోసియేషన్ వారు స్వర్ణ హస్త కంకణాన్ని బహూకరించి స్వర్ణ కమలాలతో `కనకాభిషేకం` చేశారు.
అచార్య నాగార్జున విశ్వవిద్యాలయం డి డాక్టరేటును అందుకున్నారు.
విఖ్యాత హస్యనటులయిన రేలంగి.. రాజబాబు- చలం- అల్లు- సుత్తి వీరభద్రరావు పేరిట నెలకొల్పిన పురస్కారాలన్నీ బ్రహ్మానందం కైవసం చేసుకోవడం అరుదైన ఘటన! `హాస్య కళా విధాత` అవార్డును టీ.ఎస్‌.ఆర్‌ కాకతీయ లలిత కళాపరిషత్‌ వారు బహూకరించారు. రేలంగి తన ప్యాంటూ షర్టూ మార్చుకొని బ్రహ్మానందం రూపంలో మళ్లీ తెరమీదికొచ్చాడ ని కితాబులందు కొన్న నటుడు బ్రహ్మానందం.
రెండు దశాబ్దాలుగా తన హాస్యనటనతో ఎన్నో మైలురాళన్లి అధిగమించి దాదాపు 745 చిత్రాల్లో నటించిన ఘనత వహించారు.
తక్కువ వ్యవధిలో అత్యధిక చిత్రాల్లో నటించిన నటుడిగా ఆయన తిరుగులేని రికార్డు నెలకొల్పడం విశేషం.
శ్రీ బ్రహ్మానందం గారు పైకి హాస్య నటుడిగా కనుపించినా ఆయన ఎంతటి భక్తి తత్పరులో.. సాహిత్య ప్రియులో.. గంభీర వ్యక్తిత్వ సంపన్నులో నాకు వ్యక్తి గతంగా ఎరుక‌.. అని శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

హాస్యనటుల్లో బ్రహ్మానందం  చదువుకున్నవాడు కావటం వల్ల సైకాలజీ వంటి వాటి పట్ల అవగాహన బాగా ఉందని అనిపిస్తుంది. ఆయనలో నిగూఢమైన మరొక మనిషి.. ఒక వేదాంతి.. ఒక స్కాలర్ కూడా ఉన్నారనిపిస్తుంది.. అని కీ.శే. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు గతంలో ఒక సావనీర్ లో పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మకమైన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోఅత్యధిక సినిమాలు నటించి నందుకు చోటు దక్కించుకున్న ఏకైక హాస్య నటుడు.

Tags:    

Similar News