ఇంతకు ప్రభాస్‌ ఎవరి వలలో పడతాడో?

Update: 2019-11-02 06:23 GMT
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'బాహుబలి' చిత్రం తర్వాత ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అయ్యాడు. సాహో చిత్రంతో ఆ విషయం మళ్లీ నిరూపితం అయ్యింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్‌ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు జాన్‌ అనే టైటిల్‌ ను అనుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. సాహో చిత్రం పూర్తి కాకుండానే జాన్‌ ను ప్రారంభించిన ప్రభాస్‌ ఇప్పుడు జాన్‌ విడుదలకు ముందే మరో సినిమాను పట్టాలు ఎక్కించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ప్రభాస్‌ జాన్‌ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇదే సమయంలో ప్రభాస్‌ తో సినిమాను నిర్మించేందుకు టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వరకు పదుల సంఖ్యలో నిర్మాతలు పోటీ పడుతున్నారు. వారికి ఉన్న పరిచయాలతో ప్రభాస్‌ తో సినిమాను నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభాస్‌ డేట్లు కావాలంటే చాలా పెద్ద స్థాయిలో పైరవీలు కూడా జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రముఖ నిర్మాతలు ఎంతో మంది ప్రభాస్‌ డేట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగు టాప్‌ నిర్మాత దిల్‌ రాజు కూడా ప్రభాస్‌ డేట్ల కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

దిల్‌ రాజు బ్యానర్‌ లో ఇప్పటికే ప్రభాస్‌ మున్నా మరియు మిస్టర్‌ పర్‌ ఫెక్ట్‌ చిత్రాలు చేశారు. ఇప్పుడు హ్యాట్రిక్‌ సినిమా చేద్దాం ఒక మంచి కథ ఉంది తప్పకుండా నీకు నచ్చుతుంది అంటూ ప్రభాస్‌ ను ఒప్పించేందుకు దిల్‌ రాజు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చేస్తున్న జాన్‌ సినిమాను పెదనాన్న కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. జాన్‌ తర్వాత సినిమాను కూడా ఆయనకే అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జాన్‌ ను యూవీ క్రియేషన్స్‌ తో నిర్మిస్తున్న కృష్ణంరాజు తర్వాత సినిమాను మరో నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించే అవకాశాలు ఉన్నాయట.

చాలా మంది నిర్మాతలు ప్రభాస్‌ తో సినిమాను నిర్మించేందుకు ఎవరికి తోచిన విధంగా వారు వలలు వేస్తున్నారు. మరి మన బాహుబలి ఎవరి వలలో పడతాడో చూడాలి. ప్రభాస్‌ తో సినిమా నిర్మిస్తే లాభం కోట్లల్లో ఉంటుందని అలాగే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందని నిర్మాతల అభిప్రాయం. అందుకే రెబల్‌ స్టార్‌ డేట్ల కోసం ఇంత ఆరాటపడుతున్నారు.
Tags:    

Similar News