అగ్ర దర్శకులిద్దరూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారా..?

Update: 2022-09-02 08:30 GMT
సినీ ఇండస్ట్రీలో ఎవరి కెరీర్ అయినా సక్సెస్ మీదనే ఆధారపడి ఉంటుంది. హిట్లు ఉన్నప్పుడు మోసినవారే.. ప్లాప్స్ వచ్చినప్పుడు ట్రోల్ చేస్తుంటారు. ఇక్కడ విజయాలు పరాజయాలు శాశ్వితం కాదు. వరుస హిట్లు కొట్టినవారైనా ఒక్క ప్లాప్ తో కిందికి పడిపోతారు. ప్లాపుల్లో ఉన్నవారు ఒక సక్సెస్ పడితే పైకి లేస్తుంటారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ లో ఇద్దరు అగ్ర దర్శకులకు అర్జెంట్ గా హిట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీరు డైరెక్ట్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలవడంతో కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా నెగెటివిటీని ఫేస్ చేయాల్సి వస్తోంది. వాళ్ళెవరో కాదు కొరటాల శివ మరియు పూరీ జగన్నాథ్.

గతేడాది వరకూ తెలుగు చిత్ర పరిశ్రమలో అపజయం ఎదురుగని దర్శకుడిగా కొనసాగారు కొరటాల శివ. కమర్షియల్ కంటెంట్ కు తనదైన శైలిలో సందేశాన్ని జోడిస్తూ వరుస హిట్లు అందుకున్నాడు. ఇలాంటి డైరెక్టర్ మెగా తండ్రీకొడుకులు చిరంజీవి మరియు రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో ''ఆచార్య'' చిత్రాన్ని తెరకెక్కించడంతో అందరిలో భారీ హైప్ క్రియేట్ అయింది.

అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన 'ఆచార్య' సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. పేలకమైన కంటెంట్ తో బలహీనమైన క్యారక్టరైజేష్ తో ప్రేక్షకులను ఈ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టకపోయింది. ఫలితంగా ఆల్ టైం డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. 150కి పైగా సినిమాలు చేసిన చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ అనిపించుకుంది. దీని దెబ్బకు కొరటాల ఎప్పుడూ లేనంత ట్రోల్స్ ఎదుర్కొన్నాడు.

మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పిలవబడే పూరీ జగన్నాథ్ ''లైగర్'' సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. పూరి రైటింగ్ - డైలాగ్స్ - మేకింగ్ కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇలానే ఎన్నో బ్లాక్ బస్టర్స్ సాధించాడు. ప్రతీ హీరో కూడా ఒక్క సినిమా అయినా కలిసి వర్క్ చేయాలని కోరుకునే దర్శకుడాయన.

అయితే గత కొన్నేళ్లుగా తన రేంజ్ కు తగ్గ సినిమాలు చేయని పూరీ.. 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' అనే స్పోర్ట్స్ యాక్షన్ సినిమా అనౌన్స్ చేయడంతో అందరిలో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అందులోనూ ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడం.. ఇండియా మొత్తం షేక్ అవుతుందని చెప్పడంతో అందరూ నమ్మారు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది.

అసలు ఇది పూరీ జగన్నాథ్ సినిమానేనా అని సందేహించే విధంగా 'లైగర్' సినిమా ఉంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి అదే స్థాయిలో నష్టాలు వస్తున్నాయి. సినిమాకు పెట్టిన పెట్టుబడి.. ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్లను పోల్చి చూస్తే ఆల్ టైం డిజాస్టర్స్ లిస్టులో జాయిన్ అవడం గ్యారెంటీ అని చెప్పవచ్చు

ఇలా టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్లు కొరటాల శివ & పూరీ జగన్నాథ్ ఇద్దరూ రెండు భారీ డిజాస్టర్స్ తో డిజప్పాయింట్ చేశారు. అయితే వీరిద్దరూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. 'జనగణమన' సినిమాతో పూరీ.. NTR30 ప్రాజెక్ట్ తో కొరటాల సాలిడ్ హిట్స్ సాధిస్తారని భావిస్తున్నారు. ఇప్పుడు ట్రోల్ చేసిన వారితోనే ప్రశంసలు అందుకుంటారని అంటున్నారు. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News