సూపర్‌ హిట్‌ ప్రాంచైజీ దర్శకుడు ఖరారు!

బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న దర్శకుల పేర్లలో అయాన్ ముఖర్జీ ఒకరు అనడంలో సందేహం లేదు.

Update: 2024-10-05 04:52 GMT

బాలీవుడ్‌ లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న దర్శకుల పేర్లలో అయాన్ ముఖర్జీ ఒకరు అనడంలో సందేహం లేదు. రాజ్ కుమార్‌ హిరాణి, సంజయ్ లీలా భన్సాలీ, సిద్దార్థ్‌ ఆనంద్‌ వంటి స్టార్‌ దర్శకులకు ఏమాత్రం తక్కువ కాకుండా అయాన్ ముఖర్జీ పేరు వినిపించడం నిజంగా ఆశ్చర్యకర విషయం. ఇప్పటి వరకు ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు మూడు మాత్రమే. ఇండస్ట్రీలో ఆయన దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి కేవలం అయిదు ఆరు సంవత్సరాలు మాత్రమే అయింది. అయినా కూడా ఆయన క్రేజ్ మామూలుగా లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ లో మోస్ట్‌ అవైటెడ్‌ మూవీస్ కు ఆయన దర్శకత్వం వహిస్తున్నాడు.

సూపర్‌ హిట్‌ మూవీ వార్‌ కి సీక్వెల్‌ గా రూపొందుతున్న వార్‌ 2 కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. సిద్దార్థ్‌ ఆనంద్‌ తో వార్‌ 2 చేయాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది అయాన్‌ ముఖర్జీ చేతికి వచ్చింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్‌ సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధూమ్‌ 4 కి సైతం అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నట్లుగా యశ్‌ రాజ్ ఫిలిమ్స్ నుంచి సమాచారం అందుతోంది. ధూమ్‌ 4 సినిమాకు ఎంతో మంది దర్శకులను పరిశీలించారు. హాలీవుడ్‌ రేంజ్‌ లో సినిమా ఉండాలి అంటే అయాన్‌ ముఖర్జీకి మాత్రమే సాధ్యం అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటి వరకు అయాన్ ముఖర్జీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా వేకప్‌ సిద్‌ నిరాశ పరచగా, యే జవానీ హై దివానీ సినిమా కు మంచి స్పందన దక్కింది. ఆ తర్వాత వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా ఫలితం ఏంటి అనేది క్లారిటీ లేదు. అయినా అయాన్ ముఖర్జీ కి బాలీవుడ్‌ లో మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం వార్‌ 2 సినిమాను చేస్తున్నాడు. ఇప్పటి వరకు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో వచ్చిన మూడు సినిమాల్లోనూ హీరోగా రణబీర్‌ కపూర్‌ నటించాడు. మొదటి సారి అయాన్ ముఖర్జీ తన సినిమాను రణబీర్ కపూర్ తో కాకుండా హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ తో చేస్తున్నారు. వార్ 2 తర్వాత మళ్లీ రణబీర్‌ కపూర్‌ తో చేయబోతున్నాడు.

బాలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రతిష్టాత్మక ధూమ్‌ 4 సినిమాను రణబీర్‌ కపూర్ తో చేయాలని యశ్ రాజ్ ఫిలిమ్స్ చాలా కాలంగా చర్చలు జరుపుతోంది. ఆయన సైతం ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఇప్పటికే ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఆలస్యం అవుతోంది. ప్రస్తుతం రణబీర్ కపూర్ రామాయణం సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తయిన తర్వాత ధూమ్ 4 సినిమాను మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో వార్‌ 2 ను దర్శకుడు అయాన్ ముఖర్జీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. ధూమ్‌ 4 సినిమాను హాలీవుడ్‌ రేంజ్‌ యాక్షన్ సినిమాగా రూపొందించాలని యశ్‌ రాజ్‌ ఫిలిమ్స్ భావిస్తుంది. అయాన్‌ ముఖర్జీ ఎంత వరకు ధూమ్‌ ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.

Tags:    

Similar News