'టాక్సిక్' పని ముగించిన హాలీవుడ్ స్టార్..!
తాజాగా జె జె పెర్రీ సోషల్ మీడియా ద్వారా 'టాక్సిక్' సినిమా గురించి విషయాలను పంచుకుంటూ తన ఆనందంను వ్యక్తం చేశాడు.;
కేజీఎఫ్ ప్రాంచైజీ సినిమాల తర్వాత కన్నడ రాక్ స్టార్ యశ్ కి పాన్ ఇండియా స్థాయిలో స్టార్డం దక్కింది. కేజీఎఫ్ 2 సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేయడంతో ఆయన తదుపరి సినిమాపై అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. అందుకే యశ్ చాలా గ్యాప్ తీసుకుని తదుపరి సినిమాను మొదలు పెట్టిన విషయం తెల్సిందే. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వెంకట్ నారాయణ నిర్మిస్తున్న 'టాక్సిక్' సినిమాలో యశ్ నటిస్తున్నాడు. ఒక మోస్తరు సినిమా అన్నట్లుగా మొదలైన ఈ సినిమా ఇప్పుడు హాలీవుడ్ సినిమాల రేంజ్కి వెళ్లిందని, ఇంగ్లీష్లోనూ విడుదల కాబోతుంది అంటూ ఇటీవల ఒక కన్నడ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది.
కొన్ని ప్రత్యేక సన్నివేశాలను ఇండియన్ భాషలకు, ఇంగ్లీష్ భాష ప్రేక్షకులకు వేరు వేరుగా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తున్నట్లు మొదటి నుంచి సమాచారం అందుతోంది. ముఖ్యంగా హాలీవుడ్ హిట్ సినిమాలకు వర్క్ చేసిన కొందరు స్టార్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కో ఆర్డినేటర్ జె జె పెర్రీ, జాన్ విక్ తో పాటు పలువురు ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం వర్క్ చేశారు. తాజాగా జె జె పెర్రీ సోషల్ మీడియా ద్వారా 'టాక్సిక్' సినిమా గురించి విషయాలను పంచుకుంటూ తన ఆనందంను వ్యక్తం చేశాడు. అంతే కాకుండా యశ్ ను తన స్నేహితుడు అంటూ సంభోదించాడు.
సోషల్ మీడియాలో జెజె పెర్రీ.. టాక్సిక్ సినిమా కోసం నా స్నేహితుడు యశ్ తో కలిసి వర్క్ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. భారతదేశంలోనే గొప్ప నటుడు యశ్. యూరప్ నలుమూలల నుంచి నా ప్రియమైన స్నేహితులు వచ్చి ఈ సినిమా కోసం వర్క్ చేశారు. వారందరి వర్క్ అద్భుతంగా వచ్చిందని నాకు తెలుసు. ఎప్పుడెప్పుడు వెండి తెరపై ఈ సినిమాను చూస్తానా అని ఎదురు చూస్తున్నాను. చాలా అద్భుతమైన సినిమాలో నటించాం అనే సంతృప్తి ఉందని పోస్ట్ చేశాడు. పెర్రీ పోస్ట్కి యశ్ స్పందిస్తూ తనదైన శైలిలో అభిమానంను చూపిస్తూ ట్వీట్ చేశాడు.
ఎక్స్ ద్వారా యశ్ స్పందిస్తూ... నా మిత్రమా, టాక్సిక్ సినిమా కోసం నీతో కలిసి పని చేయడం సంతోషాన్ని కలిగించింది. మీరు సినిమాను అద్భుతమైన శక్తిగా నిలిపారు అనిపించింది అంటూ ట్వీట్ చేశాడు. టాక్సిక్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండాలి అంటే అక్కడి స్టంట్స్ కోఆర్డినేటర్స్ అవసరం కదా... అందుకే ఈ సినిమా కోసం వారిని తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అయిందని టాకీ పార్ట్ బ్యాలెన్స్ ఉండి ఉంటుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తూ ఉండగా, నయనతార ముఖ్య పాత్రలో కనిపించబోతుంది.