'కంగువా' తెలుగు... సరికొత్త ట్రెండ్‌!

తమిళ్ స్టార్‌ హీరో సూర్య 'కంగువా' సినిమాతో నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.

Update: 2024-10-14 11:21 GMT

తమిళ్ స్టార్‌ హీరో సూర్య 'కంగువా' సినిమాతో నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'కంగువా' సినిమాను తమిళ్‌ బాహుబలి సినిమా అంటూ అక్కడి మీడియా తెగ ఊదరగొట్టేస్తుంది. కంగువా సినిమా గత ఏడాది కాలంగా తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా అన్ని భాషల సూర్య ఫ్యాన్స్‌ని ఊరిస్తోంది. మొన్న దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల అవ్వాల్సి ఉన్నా రజనీకాంత్‌ వేట్టయాన్ సినిమా విడుదల ఉన్న కారణంగా వాయిదా వేయడం జరిగింది. నవంబర్ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ని షురూ చేశారు.

కంగువా సినిమాను తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నిర్మించడం జరిగింది. ప్రభాస్‌కి అత్యంత సన్నిహితులు అయిన వంశీ, ప్రమోద్‌లు ఈ సినిమాను స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌తో కలిసి నిర్మించారు. అందుకే తెలుగు లో కంగువా సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. తెలుగు లో సినిమా ప్రమోషన్ కోసం రెబల్‌ స్టార్ ప్రభాస్‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కి ఆహ్వానించారని తెలుస్తోంది. ఆయన సైతం సూర్యతో ఉన్న స్నేహం, యూవీ క్రియేషన్స్‌ తో ఉన్న అనుబంధం కారణంగా కంగువా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ లో ప్రభాస్ హాజరు అవ్వబోతున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకమైన అనుమతులు దక్కినట్టుగా తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో డబ్బింగ్‌ సినిమాల టికెట్ల రేట్లను సైతం పెంచేందుకు తెలుగు రాష్ట్రాల్ల ప్రభుత్వాలు అనుమతి ఇస్తున్నాయి. ఇప్పుడు కంగువా సినిమా మిడ్‌ నైట్‌ షో కి సైతం అనుమతులు వచ్చాయని తెలుస్తోంది. నవంబర్‌ 14న విడుదల కాబోతున్న కంగువా సినిమా యొక్క షో లో అర్ధరాత్రి ఒంటి గంట నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించిన అనుమతులు వచ్చాయని తెలుస్తోంది. అంతే కాకుండా కంగువా సినిమా మొదటి రోజు అయిదు లేదా ఆరు షోలు వేసేందుకు అనుమతులు దక్కాయని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఒక డబ్బింగ్‌ సినిమాకు ఇంత భారీ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో అనుమతులు దక్కిందే లేదు. ఇది సరికొత్త ట్రెండ్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కంగువా సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందడంతో పాటు ఇతర కారణాల వల్ల అనుమతులు వచ్చాయని తెలుస్తోంది.

కంగువా సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ నటి దిశా పటానీ హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు బాబీ డియోల్‌ కీలక పాత్రలో నటించారు. ఇంకా పలువురు ప్రముఖులు నటించారు. టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో పాటు, సోషియో ఫాంటసీ కథాంశం అంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమా గురించి వచ్చిన వార్తలు అంచనాలను అమాంతం పెంచేశాయి. తెలుగు ప్రేక్షకులు సైతం కంగువా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా రూ.50 కోట్ల వసూళ్లను మేకర్స్‌ ఆశిస్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News