జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే ఎవడైనా..!

ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తాజాగా ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-07-12 00:30 GMT

నందమూరి తారక రామారావు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తాత పోలికలు పునికి పుచ్చుకోవడమే కాదు, నటనలో డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు. RRR చిత్రంతో గ్లోబల్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన తారక్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డమ్ ను నిలబెట్టుకునే విధంగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు తాజాగా ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

కోటా శ్రీనివాసరావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతమున్న హీరోలంతా జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే అని వ్యాఖ్యానించారు. "నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే.. ఇప్పుడున్న యంగ్ స్టర్స్ లో కొద్దో గొప్పో విషయం ఉండి, సత్తా ఉన్న నటుడు ఎవడైనా ఉన్నాడంటే వాడే జూనియర్ ఎన్టీఆర్. నా ప్రకారం వాడి తర్వాతే ఎవడైనా.. పొట్టిగా ఉంటాడని కామెంట్లు చేశారు. ఆ పొట్టితనమే తనని కాపాడుతుంది చంద్రమోహన్ లాగా.. ఎందుకంటే చంద్రమోహన్ కు ఎవరూ కాంపిటేషన్ కాదు, వాడు ఎవడికీ కాంపిటేషన్ కాదు (నవ్వుతూ)" అని కోట అన్నారు.

"డైలాగ్స్, డ్యాన్సులు, యాక్షన్.. ఇలా ప్రతీ దాంట్లో విషయం ఉన్నవాడు ఎన్టీఆర్. రామారావు గారు పిచ్చోడు ఏమీ కాదు. విషయం ఉన్నోడు కాబట్టే ఆయన్ను ఒళ్లో కూర్చోబెట్టుకుని బొట్టు పెట్టి మరీ తన పేరు పెట్టుకున్నారు'' అంటూ కోట శ్రీనివాసరావు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. గతంలోనూ కోట అనేక సందర్భాల్లో తారక్ పై ప్రశంసలు కురిపించారు. తనకు బాగా నచ్చిన హీరో జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పారు. మహేశ్ బాబు, అల్లు అర్జున్ కూడా మంచి నటులే కానీ.. ఎన్టీఆర్ కు ఉన్న పొటెన్షియాలిటీ ఎవరికీ లేదని అన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ను కూడా రీప్లేస్ చేసాడని కొనియాడారు కోట.

ఇక తారక్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన రెండు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. ఫస్ట్ సాంగ్, గ్లింప్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ నెలలోనే రెండో పాటను విడుదల చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. 'దేవర' పార్ట్-1 ను 2024 సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు.

'వార్ 2' సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ లో, హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'NTR 31' మూవీ రానుంది. దీనికి 'డ్రాగన్' అనే టైటిల్ ప్రచారంలో వుంది. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీని తర్వాత దేవర పార్ట్-2 మీద ఫోకస్ చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News